ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి సమీపంలోని ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షలతో నీటిని అందించే మినీ ఎత్తిపోతలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 65 మినీ ఎత్తిపోతలతో వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే రికార్డు సాధించిందన్నారు. ప్రతి ఎకరాకూ సాగు నీరు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మెట్పల్లి మినీ ఎత్తిపోతలతో 2 వేల ఎకరాలకు నీరు అందనున్నదని తెలిపారు. ఎత్తిపోతల నీటిని కాల్వల నుంచి తరలించి చెరువులు, కుంటలను నింపుతామని చెప్పారు. దీంతో ఇకపై సాగునీటికి ఢోకా ఉండదని స్పష్టం చేశారు.
వనపర్తి, జనవరి 10 : రాష్ట్రంలో సాగునీటి రాక, ఉచితంగా 24 గంటల విద్యుత్ తో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి రెట్టింపు ఉత్సాహంతో వ్యవసాయం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం వనపర్తి సమీపంలోని ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షలతో మెట్పల్లి, రంగంగడ్డ, నందిమల్ల గడ్డ, మేగ్యాతండాలకు సాగునీరు అందించే మినీ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే రూ.8 లక్షలతో మెట్పల్లిలో నిర్మించిన రీడింగ్రూంకు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్పల్లి ఎత్తి పోతల పథకంతో దాదాపు 2 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదని తెలిపారు. మినీ ఎత్తిపోతల పథకాలతో కాలువల నుంచి నీటిని అందించి చెరువులు, కుంటలు నింపుతామన్నారు. దీంతో సాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షలతో మినీ లిఫ్ట్లను ఏర్పాటు చేసి 5 చోట్ల నుంచి 5 ప్రాంతాలకు సాగునీరును అందేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సాగునీటి రాకతో రైతులు కూరగాయలు, ఆకుకూరల సాగుతోపాటు పాడి పశువులతో ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా పంటలను సాగు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 65 మినీ ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో రాష్ట్రంలోనే వనపర్తి రికార్డు నెలకొల్పిందని మంత్రి వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ఆర్ నిధులతో ఎత్తిపోతలను పూర్తి చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వనపర్తిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఎత్తిపోతల పథకం వద్ద గంగా జలాలకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, కౌన్సిలర్లు బండారుకృష్ణ, మార్కెట్ డైరెక్టర్లు పరంజ్యోతి, లతీఫ్, నాయకులు తిరుపతయ్య, నందిమల్ల శ్యాం, జాతుృనాయక్, రహీం, ప్రశాంత్, జోహెబ్, శివ తదితరులున్నారు.