వనపర్తి, ఆగస్టు 2 : రైతు రాజ్యమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగగా ఉన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చాక పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో సాగునీరు లేక ఎంతోమంది వలసలు వెళ్లిన ఘటనలను కండ్లారా చూసిన ఉద్యమ నాయకుడు రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో ఎన్నో పథకాలను సృష్టించి, అన్నదాత పక్షాన నిలబడిన ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని స్పష్టం చేశారు. రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం పెబ్బేర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి స్థానిక నాయకులతో కలిసి గజమాలను వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని పంట పొలాలే దర్శనమిస్తున్నాయన్నారు. ఆరుగాలం పండిచిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ, పల్లెల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. గతంలో సాగుకు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని.. నేడు 24 గంటలు విద్యుత్ను అందజేస్తున్నామన్నారు. రైతులను రైతుబంధు, రైతుబీమా పథకాలతో ఆదుకుంటున్నామన్నారు. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి నిలబడినా దొరికే పరిస్థితి ఉండేది కాదని, ప్రస్తుతం ఎరువులను అందుబాటులో ఉంచుతున్నారు. రుణమాఫీ చేసినందుకు గానూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.