వనపర్తి, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతామన్నారు. పాలమూరు ప్రజల మీద సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 25లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో మంత్రి నిరంజన్రెడ్డి సోమవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాకేంద్రంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ సాధనకు పాలమూరు ఓట్లే ఇంధనమన్నారు. మహబూబ్నగర్ ఎంపీగా కేసీఆర్ తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించారన్నారు. ఇది పాలమూరు ప్రజలకు దక్కిన గౌరవమని కొనియాడారు. పాలమూరు ప్రజలు తమ కన్నీళ్లనే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఇంధనంగా మార్చి కేసీఆర్ను ఢిల్లీకీ ఎంపీగా పంపించారన్నారు. తెలంగాణ సాధించి రాష్ర్టానికి వచ్చారని గుర్తు చేశారు.. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రలో విలీనమైనదన్నారు.
కేసీఆర్ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ సాధించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారన్నారు. ప్రతిపక్షాలు కేసులతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రతిబంధకాలు సృష్టించారన్నారు. అవరోధాలను అధిగమించి ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ పర్యటనకు పాలమూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో సభతో అర్థమైందన్నారు. విపక్ష నేతలు కొందరు వీధుల్లో మొరుగుతూ కారుకూతలు కూస్తున్నారన్నారు. కొందరు కిరాయి సైన్యాలతో ప్రజలు తమ వైపే ఉన్నారని భ్రమపడుతున్నారన్నారు.
ప్రజాక్షేత్రంలో విపక్షాలు పరిస్థితి గుండు సున్నా అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 25లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం 12 లక్షల ఎకరాలు సాగవుతున్నదన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు రూ.15కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం అసాధారణ విషయమన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా జిల్లాకు అదనంగా ఇస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.