తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ విద్యారంగంలో సంస్కరణలను తీసుకొచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో రూ.25 లక్షల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్ఞానవంతమైన సమాజం కోసం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు
వనపర్తి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. శుక్రవారం ఖిల్లాఘణపురం మండలకేంద్రంలో రూ.25 లక్షల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు అందించడం రాజ్యాంగ విధి అన్నారు. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న సందర్భంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. భావి పౌరులు భవిష్యత్ సంపద అని అభివర్ణించారు. వీరు జ్ఞానవంతులైతే మంచి సమాజం నిర్మాణమవుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మ న ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలివి, ప్రతిభ కలిగిన వారు ఉంటే భౌతిక సంపదను వారి మేథస్సు నుంచి వారే సృష్టిస్తారని చెప్పా రు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు, బోధన, రుచికరమైన ఆహారం ఉంటే విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారని సూచించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ప్రభు త్వ పాఠశాలలకు ఆదరణ కరువైందని, దీంతో తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను ప్రైవేటుకు పంపాలనే ఆలోచన తో అటువైపు మొగ్గారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఇ ప్పుడు లేదని, రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చే స్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని ఆంధ్రా కార్పొరేట్ వి ద్యాసంస్థలు ఇక్కడ తిష్టవేశాయని, భ్రమలకు వెళ్లకుం డా ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలని తల్లిదండ్రులకు మంత్రి సూచించారు. తల్లిదండ్రుల కష్టమంతా విద్యకు, వైద్యానికి ధారపోస్తున్నారని, దీని నుంచి బయటపడి ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్న లక్ష్యంతో బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రజలు పెట్టే ఖర్చుల నుంచి బయట పడగొట్టాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు అనంతరం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలు ఆశించిన దారిలో మళ్లించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు బలోపేతంతో కార్పొరేట్ విద్యాసంస్థలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు చూస్తే ఆశ్చర్యమేస్తున్నదని, తాము చదువుకున్నప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవని గుర్తు చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల విద్యార్థులను విధిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేయాలని సూచించారు.
పిల్లల చదువుపై ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ సూచించారు. పిల్లలు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చేలా చూడాలని, హోంవర్క్తోపాటు పిల్లలకు బేసిక్ లెర్నింగ్పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు చదివితేనే దేశ భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. చదువును నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సౌమ్యనాయక్, సర్పంచ్ వెంకటరమణ, సివిల్ సప్లయి డీఎం కొండల్రావు, పాలమూరు-రంగారెడ్డి డీఈ సత్యరాగిరి, డీఈవో రవీందర్, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.