మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వైద్యరంగంలో పెనుమార్పులు సంభవించాయని.. మహబూబ్నగర్ వంటి పట్టణాల్లోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తున్నదని క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శిల్పారామంలో బుధవారం నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో మంత్రి పాలొని జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలమూరు, రాష్ట్రం వైద్య ఆరోగ్యరంగంలో సాధించిన ప్రగతిపై ప్రదర్శించిన డాక్యుమెంటరీలను మంత్రి సహా అతిథులు తిలకించి వైద్యారోగ్యశాఖకు చెందిన బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఆత్యుత్తమ వైద్యసేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో మొట్టమొదటి కళాశాల మనదేనని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ జనరల్ దవాఖానలో అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అప్పుడు సింగిల్ డిజిట్లో వైద్యులు, సిబ్బంది ఉండేవారని.. ఇప్పుడు వైద్యులు, ఫార్మాసిస్టులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని పెద్ద ఎత్తున నియమించామన్నారు. తెలంగాణకు ముందు ముగ్గురు ఫార్మాసిస్టులు ఉంటే ఇప్పుడు 38 మంది, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటే ఇప్పుడు 40మంది, 30మంది నర్సులు ఉంటే ఇప్పుడు 280మందిని, 30 మంది సిబ్బంది ఉంటే ఇప్పుడు 250మందిని నియమించామన్నారు. తెలంగాణ రాక ముందు ఒక్క ఐసీయూ, ఆక్సిజన్ పడక కూడా ఉండేది కాదని.. ఇప్పుడు 100 ఐసీయూ పడకలు, 500 ఆక్సిజన్ పడకలు, రెండు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు.
ఇన్ని సౌకర్యాలు కల్పించినందున ఒక్క అంబులెన్స్ కూడా వైద్యం కోసం మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్ నుంచి రోగులు పాలమూరుకు వచ్చి వైద్య సేవలు పొందారని మంత్రి గుర్తు చేశారు. చావుబతుకుల్లో ఉన్నవారికి అత్యుత్తమ సేవలు అందించి బతికించిన ఘనత మనదేనన్నారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.140 కోట్లు, సీఎంఆర్ఎఫ్ కోసం రూ.23 కోట్లు ఖర్చు చేశామన్నారు. వచ్చే ఏడాది లోగా వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించుకుంటామని తెలిపారు. కిడ్నీ, గుండె , కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
గాంధీ, ఉస్మానియా దవాఖాన తరువాత మన దవాఖానే నిలిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్చెర్మన్ గణేశ్, ఎంపీపీ సుధాశ్రీ, డీఎంహెచ్వో కృష్ణ, మెడికల్ డైరెక్టర్ రమేశ్, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్వో భాస్కర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్లు రఫీక్, రాధ, స్వప్న, జీజీహెచ్ సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రజలకు ఖరీదైన వైద్యం అందించేందుకు గుండె, నరాలు, గ్యాస్ట్రో, ప్లాస్టిక్ సర్జరీ వైద్యసేవలను త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా జనరల్ దవాఖానలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించి, రోగులకు పండ్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దవాఖానకు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం నర్సింగ్ కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, డీఎంహెచ్వో కృష్ణ, వైద్యాధికారులు జీవన్, భాస్కర్, ఆర్ఎంవో ప్రసన్నకుమార్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, మధుసూదన్రెడ్డి, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యంయాదవ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.