వానకాలం సీజన్కు సరిపడా ఎరువులు ఫుల్గా ఉన్నాయి. వ్యవసాయ అధికారుల సాగు అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిల్వలను సిద్ధం చేసింది. రైతుబంధు సాయం కర్షకుల ఖాతాల్లో జమవుతున్న తరుణంలో కర్షకులు కోటి ఆశలతోవిత్తనాలు విత్తుతున్నారు. దీంతో అవసరం మేరకు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వచ్చిన ఎరువులతోపాటు మరింత స్టాక్ వస్తూనే ఉంటుందని అధికారులుసూచించారు. కాగా జడ్చర్ల రేక్ పాయింట్కు సోమవారం గ్రోమోర్ కంపెనీకి చెందిన ఎరువుల వ్యాగన్ వచ్చింది. ఇందులో మొత్తం 2,673.6 మెట్రిక్ టన్నులు వచ్చాయి. వారం రోజుల కిందట కూడా 2,369 మెట్రిక్ టన్ను లు, ఆదివారం 740 మెట్రిక్ టన్నులు వచ్చింది. వచ్చిన స్టాక్ను వివిధ ప్రాంతాల డీలర్లకు సరఫరా చేశారు. ఎరువులకు ఢోకా లేకపోవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జడ్చర్ల, జూలై 3: ఈ ఏడాది వానకాలం పంటల సాగుకు సరిపడా ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వానకాలంలో పలు రకాల పంటలను రైతులు సాగు చేస్తారు. అందుకు అవసరమైనన్ని ఎరువులను అధికారులు అంచనా వేసి గోదాంలలో నిలువ చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఎరువులకు డిమాండ్ ఉంటుంది. ముందస్తుగానే ఎరువులు కొనుగోలు చేస్తుండడంతో సదరు దుకాణాలు రైతులతో సందడిగా మారాయి. ఎరువుల కొరత ఉంటే వ్యవసాయ పనులతోపాటు సాగు ఆలస్యమై దిగుబడులు కూడా తగ్గుతాయి. అందుకోసమే వ్యవసాయశాఖ అధికారులు వానకాలంలో రైతులు సాగుచేసే పంటలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలతో జిల్లాకు ఎంత మొత్తంలో ఎరువులు కావాలో ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే నిల్వ చేశారు. సాగుచేసే పంటలను బట్టి నెలనెలా ఎరువుల అవసరాన్ని బట్టి అధికారుల లెక్కల ప్రకారం తెప్పించనున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది 53వేల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచారు. ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందనే ఉద్ద్దేశంతో 63వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. వానకాలానికి 63వేల మెట్రిక్ టన్నుల ఎరువులకుగానూ ప్రస్తుతం 43,290మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో యూరియా 12,258 మెట్రిక్ టన్నులు, డీఏపీ 5,964మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ)422 టన్నులు, సింగిల్ సూపర్ఫాస్పేట్ 578మెట్రిక్ టన్నులు, 24,069మెట్రిక్ టన్నులు వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు డీఏవో తెలిపారు. రైతుల అవసరం మేరకు ఎరువులు నెలనెలా వస్తూనే ఉంటాయని తెలిపారు.
పెరుగనున్న పత్తి, వరి సాగు
జిల్లాలో వివిధ రకాల పంటలను దాదాపు 3.77లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలు సాగు చేస్తారు. పత్తి గతేడాది వానకాలం లక్ష ఎకరాల్లో సాగుచేయగా ఈసారి 1.20లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. వరి గతేడాది 1.88లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 1.90లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. మొక్కజొన్న గతేడాది 25వేల ఎకరాల్లో సాగుచేయగా ఈ ఏడాది 28వేల ఎకరాల్లో సాగుచేసే అవకాశం ఉంది. అదేవిధంగా కంది గతేడాది 10వేల ఎకరాల్లో సాగుచేయగా ఈసారి 12,500 ఎకరాలు సాగుచేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు తగినంతగా ఎరువులను నిల్వ ఉంచుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు నాటి ప్రభుత్వాలు రైతులకు సరిపడా ఎరువులు అందించలేకపోయాయి. ఎరువుల కోసం రైతులు దుకాణాల ముందు రోజులకొద్ది పడిగా
పులు కాసేవారు. క్యూలో నిల్చొని సొమ్మసిల్లి కిందపడిపోయిన సంఘటనలు ఎన్నో. లైన్లో నిల్చున్నా.. ఎరువులు సరిపడక బ్లాక్లో కొనుగోలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కాని తెలంగాణ ఏర్పాటై బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందస్తుగానే అందుబాటులో ఉంచుతున్నది. సీజన్ రాకముందే ఎరువులను నిల్వచేస్తున్నది. సాగుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రేక్ పాయింట్కు 2,673.6టన్నుల ఎరువులు
జడ్చర్ల రేక్ పాయింట్కు సోమవారం గ్రోమోర్ కంపెనీకి చెందిన ఎరువుల వ్యాగన్ వచ్చింది. మొత్తం 2,673.6టన్నుల ఎరువులు రాగా అందులో డీఏపీ 1338.8టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1339.8టన్నులు వచ్చాయి. వారం రోజుల కిందట కూడా 2,369 మెట్రిక్ టన్నులు, ఆదివారం 740 మెట్రిక్ టన్నుల స్టాక్ వచ్చింది. రేక్ పాయింట్కు వచ్చిన ఎరువులను జిల్లాలోని వివిధ ప్రాంతాల ఫర్టిలైజర్ డీలర్లకు పంపించారు.
అందుబాటులో ఉంచాం
వానకాలానికి సంబంధించి రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీజన్కు సంబంధించి అన్ని రకాల ఎరువులు నిల్వ ఉంచాం. అవసరాన్ని బట్టి జిల్లాకు ఎరువుల సరఫరా కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలతోపాటు నెలనెలా ఎంత అవసరమో ఆ మేరకు ఎరువులు తెప్పిస్తాం. సోమవారం జడ్చర్ల రేక్ పాయింట్కు 2,673.6టన్నుల ఎరువులు వచ్చాయి.
– డీఏవో వెంకటేశ్