వనపర్తి, మార్చి 6 : పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో వెబ్ ఎక్స్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటికే స్టడీ మెటీరియల్ అందిందని, వారికి చదవడంలో ఏవైనా సందేహాలుంటే ఉపాధ్యాయులు నివృత్తి చేయాలని సూచించారు.
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆంగ్లం, హిందీ, గణితంపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని జాగత్త్రగా చూసుకోవాలన్నారు. ఆహార నియమాలు పాటించాలని, ఏవైనా చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత, ఏఎస్పీడీవో మల్లేశం, సూపరింటెండెంట్, హెచ్డబ్ల్యూవోలు, ట్యూటర్లు పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని వాణిజ్య, ఆస్తి పన్నులను అధికారులు వందశాతం వసూళ్లు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లతో ఆస్తి, వాణిజ్య పన్నులపై బుధవారం అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ పన్ను వసూళ్లలో అధికారులు, సిబ్బంది ఆలసత్వం వహించరాదన్నారు. అదేవిధంగా వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి లభ్యతను నిర్ధారించుకొని అందుకు తగ్గటు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.
అంతేకాకుండా మున్సిపాలిటీ బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పార్కుల్లో పక్షులు, ఇతర మూగజీవుల కోసం నీటి కుంటల ఏర్పాట్లు చేయాలని, నర్సరీల్లో లక్ష్యానికి తగ్గట్టుగా మొక్కల లభ్యతను ఏర్పాట్లు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వార్డులో ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత మున్సిపల్ కమిషనర్లు, డీఈలు, ఏఈలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.