Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో యువతి గొంతు కోసి దారుణంగా హత్యచేసిన ప్రేమోన్మాది మృతిచెందాడు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న వైష్ణవి (24) అనే యువతి జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని ఎస్వీకేఎం పాఠశాలలో ఏడాదికాలంగా రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నది. రోజువారీగా శనివారం సాయంత్రం పాఠశాల డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరింది.
ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అప్పటికే వైష్ణవి ఇంటికి సమీపంలో కాపుకాసి ఒంటరిగా వెళ్తున్న వైష్ణవిని అడ్డగించి కత్తితో గొంతు కోశాడు. గొంతు, కడుపు భాగాల్లో విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై వైష్ణవి అక్కడిక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికుల దాడిలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు.