ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎత్తిపోతల పథకాలతో.. సాగు, తాగునీటికి కష్టాలు తీరాయి. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నాలతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. లిఫ్ట్లతో నీటిని ఎత్తిపోస్తుండడంతో కాలం ఏదైనా సాగునీరు పుష్కలంగా పారుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా జలసిరిని సంతరించుకున్నది. దీంతో వానకాలం పంటల సాగును రైతులు సంబురంగా చేపట్టారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. తొలి ప్రాధాన్య పంటగా పెద్ద మొత్తంలో తెల్లబంగారం పండిస్తున్నారు. దీంతో ఎటు చూసినా పచ్చదనం సంతరించుకోగా.. వ్యవసాయ పనుల్లో రైతు కుటుంబాలు బిజీబిజీగా ఉన్నాయి.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు సాగు సంబురంగా చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నా యి. దుందుభీవాగు నిరంతరం ప్రవహిస్తున్నది. ఇది లా ఉండగా శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ రెండు నె లలుగా పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలో కృష్ణా ఆయకట్టు పరిధిలోని ఎంజీకేఎల్ఐ సహా ఇతర ప్రాజెక్టుల రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. దీంతో ఆయా ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల కింద ఆయకట్టు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ ఇటీవలే పంటల సాగుపై నివేదికలు తయారుచేసింది. గతేడాదికి దగ్గరగా సాగు జరుగుతున్నట్లుగా గుర్తించా రు. అయితే, సాధారణ సాగుకు మాత్రం కాస్త దూరం లో నిలిచింది. అధికంగా నీటి వనరులు పెరిగిన రీత్యా వరి సాగుపై రైతులు మొగ్గు చూపారు.
సాధారణానికి మించిన వర్షాలు పడటంతో రైతుల్లో సేద్యం కోసం నీటి కష్టాలు తీరాయి. నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పటికే 2 వేల చెరువులు ఉండగా 90 శాతానికిపైగా నిం డాయి. దాదాపు 100 చెరువులు అలుగులు పారుతుండగా, 250కు పైగా చెరువులు 75 నుంచి వంద శాతం నీటితో ఉన్నాయి. ఎంజీకేఎల్ఐ నుంచి గత జూలై 12న నీటి విడుదల ప్రారంభమైంంది. నాటి నుంచి ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు ప్రణాళిక తయారుచేశారు. ఫలితంగా జిల్లాలో పంటల సాగుకు నీటి ఢోకా లేకుం డా పోయింది. ఈ సీజన్లో జిల్లాలో 6.35 లక్షల ఎకరాలు సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. దీని ప్రకారం 5.20 లక్షల ఎకరాల్లో సాగు జరగడం గమనార్హం. గతేడాది 5.44 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఈ సారి కూడా అదే స్థాయిలో సాగు జరిగే అవకాశం ఉన్నది. జిల్లాలో పత్తిని అత్యధికంగా సాగు చేస్తున్నారు. గతేడాది 3.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకా గా, ఈసారి 3.42 లక్షల ఎకరాల్లో సాగైంది. అలాగే రెండో పంటగా గతేడాది 1.27 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈసారి 1.15 లక్షల ఎకరాల్లో సాగు జరగడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే రైతులు ప్రధానంగా పత్తి, వరి పంటలపై ఆసక్తి చూపినట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు జరగడం కూడా రైతులకు వరి సాగుకు మొక్కు చూపే లా చేసింది. అదే విధంగా మొక్కజొన్న, కందులు, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, తదితర పంటల సాగు ముమ్మరంగా జరుగుతున్నది. మొత్తమ్మీద ఈ వానకాలం పంటల సాగు సంబురంగా సాగుతుండడంతో రైతన్నల్లో ఆనందం నింపుతున్నది.
గణనీయంగా పెరిగిన సాగు..
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. కృష్ణానదిపై ఎత్తిపోతల ప్రాజెక్టులు నిండడంతోపాటు చెరువులు, కుంటల్లోనూ నీళ్లు నిండుగా ఉన్నాయి. దీంతో రైతులు గతేడాది మాదిరిగానే పంటల సాగుకు ఆసక్తి చూపించారు. ఈ సీజన్కు సరిపోయేలా వర్షాలు పడ్డాయి. రైతులు పొలాల్లో నీళ్లు నిల్వకుండా చూసుకుంటే ఈ సీజన్లో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది.
– వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, నాగర్కర్నూల్