సొంత జాగా ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వం అండగా నిలిచింది. బృహత్తరమైన గృహలక్ష్మి పథకా నికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేయనున్నది. మూడు విడుతల్లో ఇచ్చే సాయం కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగియగా.. ఐదు జిల్లాల నుంచి 2,30,521 దరఖాస్తులు వచ్చాయి. వనపర్తి జిల్లా నుంచి ఎక్కువగా రాగా.. జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి తక్కు వగా వచ్చాయి. వారం రోజుల నుంచి అధికారులు క్షేత్రస్థాయిలోపర్యటిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ చేపట్టి తర్వాత అర్హులను ఎంపిక చేసి సాయం అందించనున్నారు. దీంతో సొంతింటి కల నెరవేరనుం డగా.. పేదల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
గద్వాల, ఆగస్టు 22 : గూడు లేని పేదోడి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. వారికి సొంతిళ్లు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి పంపిణీ చేశారు. అయితే సొంతింటి స్థలం ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులతో ఇండ్లు కట్టుకోలేకపోతున్న పేదల కోసం తెలంగాణ సర్కారు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గృహలక్ష్మి పథకానికి స్థానికుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. పది రోజుల కిందట దరఖాస్తు గడువు ముగియగా.. వారం రోజులుగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అర్హులకే పథకం వర్తించేలా, మధ్యవర్తుల ప్రమేమం లేకుండా పారదర్శకంగా అధికారులు విచారణ చేస్తున్నారు. ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తుదారుల వివరాలు సేకరించనున్నారు. విచారణ పూర్తి చేసి నివేదికలు అందజేయాలని అధికారులకు కలెక్టర్లు ఆదేశించడంతో ఆ దిశగా విస్తృతంగా సర్వే నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారుల ఆధార్, రేషన్కార్డు, ఓటర్ గుర్తింపు, ఫోన్ నెంబర్, ఇంటి స్థలం వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం నుంచి అర్హులనే ఎంపిక చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు అర్హులనే ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.
గృహలక్ష్మి పథకం కింద సర్కారు రూ.3 లక్షల సాయం అందజేయనున్నది. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా.. లబ్ధిదారుల ఎంపికను అధికారులు చేపట్టారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించగా.. ఇండ్లు రాని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకుగానూ.. జాగా ఉంటే చాలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల యూనిట్లు కేటాయించారు. ఎక్కడా గుడిసెలు కనిపించకుండా అందరూ సొంత ఇండ్లల్లోనే ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్లతో ఉమ్మడి జిల్లాలో మొదటి దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడుతలో ఎవరైతే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారో వారికి విడుతల వారీగా ఎంపిక చేసి వారికి చేయూతనివ్వడానికి ఏర్పాటు చేసింది. మొదటి విడుత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందించిన తర్వాత ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు మూడు విడుతల్లో వారి ఖాతాల్లో అధికారులు నిధులు జమ చేయనున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ మరోసారి పథకం అసరాగా నిలవనున్నది. దీంతో గూడులేని పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. గృహలక్ష్మి పథకం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మహబూబ్నగర్ జిల్లా నుంచి 58,000, నాగర్కర్నూల్ జిల్లాలో 50,252, జోగుళాంబ గద్వాల జిల్లాలో 23,435, వనపర్తి జిల్లాలో 66,192, నారాయణపేట జిల్లా నుంచి 32,642 దరఖాస్తులు అందాయి. మొత్తం ఐదు జిల్లాల్లో కలిపి 2,30,521 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఎక్కువ దరఖాస్తులు వనపర్తి జిల్లా నుంచి రాగా.. జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి తక్కువగా వచ్చాయి.
జిల్లాలో అర్హత కలిగిన ప్రతి వ్యక్తి గృహలక్ష్మి పథకం వర్తించేలా ప్రభుత్వం చర్య లు తీసుకుంటున్నది. గూడు లేని పేదలకు ఇంటిని నిర్మిం చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఇల్లు లేని వారిని మాత్రమే పార దర్శకంగా ఎంపిక చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్నాం. 25వ తేదీ నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారు మినహాయిస్తే ఇల్లులేకుండా.. సొంత స్థలం ఉన్న వారందరూ పథకానికి దరఖాస్తు చేస్తున్నారు.
– కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే గద్వాల