ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా చేపట్టిన మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయి. దశల వారీగా మరమ్మతులతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పించడంతో కార్పొరేట్ తరహాలో రూపుమారింది. వనపర్తి జిల్లాలో 518 పాఠశాలలు ఉండగా.. మొదటి విడుతలో 183 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో 46 పాఠశాలల్లో పనులు పూర్తికాగా.. ఈనెలాఖరుకు మరో 50, ఆగస్టు చివరి నాటికి 32, సెప్టెంబర్ నాటికి 44 బడులు సిద్ధంకానున్నాయి.
వనపర్తి టౌన్, జూలై 15 : విద్యతనే సర్వతోముఖాభివృద్ధి అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు సకల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మనఊరు-మనబడి పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యా హబ్గా వర్ధిల్లుతున్న వనపర్తి జిల్లానుంచే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 14 మండలాల్లో 518 పాఠశాలలు ఉన్నాయి. అందులో 359 ప్రాథమిక, 57 ప్రాథమికోన్నత, 102 ఉన్నత పాఠశాలలున్నాయి. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో 183 పాఠశాలలను ఎంపిక చేయగా మూడింటికి స్థల వివాదం కారణంగా పనులు ప్రారంభించలేదు.
జిల్లా వ్యాప్తంగా 180 పాఠశాలల్లో రూ.80కోట్ల బడ్జెట్తో కేటగిరీ వారీగా పనులను విభజించారు. మౌలిక సదుపాయాలైన మూత్రశాలలు, తాగునీటి వసతి, కుర్చీలు, బెంచీలతోపాటు చిన్న చిన్న మరమ్మతులు, నూతన అదనపు తరగతి గదుల నిర్మాణం, పెయింటింగ్, ప్రహరీల నిర్మాణం, బడి తోట వంటి పనులను విభజించారు. అందులోభాగంగా మొదటి విడుతలో 22 పాఠశాలల్లో పనులు పూర్తికాగా మరో 24 పాఠశాలలు పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. జూలై చివరి నాటికి మరో 50 పాఠశాలల్లో పనులు పూర్తికానున్నాయి. ఆగస్టు చివరి నాటికి 32 పాఠశాలలు, సెప్టెంబర్ చివరి నాటికి మరో 44 పాఠశాలల్లో పనులు పూర్తయ్యేలా దశల వారీగా పనులను విభజించి ప్రణాళికాబద్ధంగా, శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.20కోట్ల పనులు పూర్తయ్యాయి. అందులో రూ.30లక్షలకు పైగా బడ్జెట్తో 41 పాఠశాలలు, రూ.30లక్షల లోపు వ్యయంతో 139 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల్లో వేగం పెంచుతున్నారు.
దశల వారీగా పూర్తి చేయిస్తున్నాం..
ప్రణాళికాబద్ధంగా, దశల వారీగా పనులు చేపడుతూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. చేసిన పనులకు బిల్లులు త్వరితగతిన చెల్లించేలా చూస్తున్నాం. కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తూ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
– గోవిందరాజులు, జిల్లా విద్యాధికారి, వనపర్తి