గద్వాల, మల్దకల్, మార్చి 26: బీజేపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని, వారి వెన్నంటి ఉంటానని.. కలిసికట్టుగా బీఆర్ఎస్ను కాపాడుకోవాలని కార్యకర్తలకు గద్వాల ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మల్దకల్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటన్న ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ మతతత్వపార్టీ అని.. ఆ పార్టీ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతుందని గుర్తు చేశారు. అలాంటి పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు, రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు ఆదరించాలన్నారు. గద్వాల నియోజకవర్గాన్ని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పాలించడం వల్ల అభివృద్ధి మసకబారి.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేదన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమం వైపు అడుగులు పడ్డాయన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గద్వాలలో ఉన్న ప్రతిపక్ష నాయకురాలు నియోజకవర్గానికి టూరిస్టులా వచ్చి అభివృద్ధిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వారి ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ప్రెస్మీట్లు పెడతారని.. దీనిని బట్టి వారికి ప్రజలపై ఎంత మమకారం ఉందో తెలిసిపోతుందన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రపంచంలోనే రైతులకు తెలంగాణ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందన్నారు. పేదింటి ఆడపడుచులను ఆదుకోవడానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆసరాతో వృద్ధులకు, వితంతువులకు చేయూతనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మల్దకల్ మండలంలో 40 కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని.. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఒకప్పుడు తమ ఊరిలో తమ ఊరికి ఒక చేతి పంపే దిక్కుగా ఉండేదని.. మిషన్ భగీరథ పథకం రాకతో నీటిగోస తీరి ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాకోబు, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, వీరన్న జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ జంబు రామన్గౌడు, మార్కెట్కమిటీ చైర్పర్సన్ శ్రీధర్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, నాయకులు ప్రహ్లాద్రావు, విక్రమసింహారెడ్డి, నర్సింహులు, శ్రీనివాస్రెడ్డి, రమేశ్రెడ్డి, సత్యారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రామచంద్రారెడ్డి, నరేందర్, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.