మహబూబ్నగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల ఇంట సిరుల పంట పండుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతున్నది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతుండడంతో అన్నదాతలు సంతోషంలో ఉన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కల్లాల వద్దకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతోపాటు బయటి ధర కంటే రూ.1,600 వరకు ఎక్కువ చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ఏ గ్రేడ్కు రూ.3,700.. హంసకు రూ.2,760 ధర పలుకుతుంది. కొనుగోలు చేసిన ధాన్యానికి అప్పటికప్పుడే నగదును కూడా అందిస్తుండడంతో రైతుల కండ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు ఈ సీజన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 7,73,096 ఎకరాల్లో వరి పండించగా.. 18,71,196 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నదని భావిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యానికి ధర పలుకుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఈ ఏడాది వానకాలం సీజన్ నిరాశజనకంగా ఉన్నప్పటికీ చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల కింద వరిధాన్యం దిగుబడి అంచనాలకు మించి వచ్చింది. ఆయా జిల్లాల్లో రైతులు విరివిగా వరిని పండిస్తున్నారు. గతంలోకంటే ఈసారి సాగునీరు అందుబాటులో ఉండటం, బోరుబావుల్లో సైతం వూట వస్తుండడంతో రైతులు పెద్దఎత్తున సాగు చేశారు. అయితే వరికోతకు వచ్చే దశలో ప్రతిసారి బహిరంగ మార్కెట్లో రేటు పడిపోవడం జరుగుతుంది. ఈసారి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. రైతులు మార్కెట్కు వెళ్లకుండానే వ్యాపారస్తులు కల్లాల వద్దకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మద్దతు ధర కన్నా రూ.1,600 వరకు ఎక్కువ ధర లభిస్తుంది. ఆయా జిల్లాల్లో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులెవరూ కేంద్రాలకు వెళ్లడం లేదు. వ్యాపారులే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకి అమ్ముకుంటున్నారు. వ్యవసాయ అధికారులు అంచనా ప్రకారం వానకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,73,096 ఎకరాల్లో వరిధాన్యం పండించారు. సుమారు 18లక్షల 71,196 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. యాసంగికి రైతులు సిద్ధమవుతున్నారు.
ధాన్యభాండాగారంగా పాలమూరు..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు విరివిగా వరిధాన్యాన్ని పండిస్తుండడంతో ధాన్యభాండాగారంగా మారింది. ప్రతి ఏటా జిల్లాలో వరి పండించే రైతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, లాభదాయకమైన పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నప్పటికీ రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది వానకాలంలో వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. ఆలస్యంగా వర్షాలు పడ్డప్పటికీ రైతులు బోరుబావుల నుంచి పంటలకు సాగునీరు అందించి కాపాడారు. ఒక దశలో పంటలు ఎండిపోతాయని ఆందోళన చెందినప్పటికీ వరుణుడు కరుణించడంతోపాటు రిజర్వాయర్ల ద్వారా రైతుల ఆశలు చిగురించాయి. ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణానది ఉప్పొంగడంతో జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసి గత ప్రభుత్వం మద్దతుగా నిలిచింది.
దీంతో మహబూబ్నగర్ జిల్లాలో 1,90,000 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో లక్షా 60వేలు, వనపర్తి జిల్లాలో 1,87, 544 ఎకరాలు, గద్వాల జిల్లాలో 80వేలు, నాగర్కర్నూల్ జిల్లాలో 1,55,552 ఎకరాల్లో వరిని సాగు చేశారు. భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల కుడి, ఎడమ కాల్వల కింద వరి పంటను సాగు చేశారు. దీంతో మహబూబ్నగర్ జిల్లాలో 3లక్షల 90వేల మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 3లక్షల 84వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 5లక్షల 10,539 మెట్రిక్ టన్నులు, గద్వాల జిల్లాలో లక్షా 20వేల మెట్రిక్ టన్నులు, నాగర్కర్నూల్ జిల్లాలో 4లక్షల 66,657 మెట్రిక్ టన్నుల ధాన్యం పండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా వరిధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో రైతులు ధాన్యాన్ని ఆరబెడుతూ అక్కడికక్కడే వ్యాపారస్తులకు అమ్ముతున్నారు..
బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువ..
ఈ ఏడాది వరికి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా క్వింటాకు రూ.1,200 నుంచి రూ.1, 600లు ఎక్కువగా ధర పలుకుతుంది. ప్రభుత్వం ఆర్ఎన్ఆర్ సొన ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,203, బీ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,183 మద్దతు ధర ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్లో సోనా ఆర్ఎన్ఆర్ ఏ-గ్రేడ్ రకానికి 3,700ల వరకు ధర పలుకుతుంది. అదేవిధంగా హంసకు రూ.2,759 ధర పలుకుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో సోనా బియ్యానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. మార్కెట్లో బియ్యం ధర అ మాంతం పెరుగుతుంది. దీం తో వ్యాపారస్తులు రైతుల వద్ద కు క్యూ కట్టారు. కొ నుగోలు చేసిన ధా న్యానికి అప్పటికప్పుడే నగదును కూడా అందిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
ఆయా జిల్లాలో వ్యవసాయ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చే ధర కన్నా బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉండటంతో కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. ఇదిలా ఉండగా, రైతులు పండించిన ధాన్యం మొత్తం అమ్ముకునేంతవరకు వేచి చూసేందుకు సెంటర్ల నిర్వాహకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏడాది రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ వస్తుండడంతో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదంతా గత ప్రభుత్వం పుణ్యమేనని అంటున్నారు.