సాగు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వానకాలం సీజన్ ప్రారంభంలోనే ఎత్తిపోతల నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. ఎగువ నుంచి స్వల్పంగా వరద రాకతో భీమా, నెట్టెంపాడు వద్ద పంపింగ్ షురూ అయ్యింది. ఆదివారం ధరూర్ మండలం గుడ్డెందొడ్డి పరిధిలో నెట్టెంపాడు ఫేజ్-1 నుంచి రోజుకు 750 క్యూసెక్కుల పంపింగ్ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మక్తల్ మండలం చిన్న గోప్లాపూర్ వద్ద భీమా ఫేజ్-1 పరిధిలోని స్టేజ్-1 పంప్హౌస్ నుంచి రోజుకూ 400 క్యూసెక్కుల నీటి విడుదలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. దీంతో రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుతుండగా.. రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. రైతుబంధు సాయంతో ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
మహబూబ్నగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ప్రారంభమవుతున్న తరుణంలో కృష్ణానదికి ప్రవాహం మొదలైంది. జూన్లోనే కృష్ణమ్మకు వరద వస్తుండడంతో నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇరిగేషన్ శాఖ అధికారుల సూచన మేరకు భీమా ఫేజ్ వన్ నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటిని విడుదల చేశారు. వారం రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలోకి నీరు చేరుతోంది. పదిహేను రోజుల కిందట ఆల్మట్టి డ్యాం నుంచి కర్ణాటకలోని శక్తినగర్ ప్లాంటుకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేశారు. వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి స్వల్పంగా వరద పెరిగింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో జాతీయ రహదారి 167పై కృష్ణానది వద్ద హై లెవెల్ వంతెనను నిర్మిస్తున్నారు. ఈక్రమంలో నదికి అడ్డంగా వంతెనకు సంబంధించి సామగ్రి ఉండడంతో శక్తినగర్ ప్లాంట్కు ఎక్కువ మొత్తంలో నీరు వినియోగించుకున్నారు. మిగతా నీటిని కిందకు వదలడంతో వస్తున్న ప్రవాహాన్ని గమనించిన ఇరిగేషన్ అధికారులు భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటిని డైవర్ట్ చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద మిగతా అవసరాలకు నీటిని వాడుకుంటున్నారు. భీమా ఫేజ్ వన్లో పంచదేవ్ పహాడ్ వద్ద పంప్ హౌస్ను చిట్టెం రామ్మోహన్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. 400 క్యూసెక్కుల నీరు సంగంబండ
రిజర్వాయర్కు చేరుతుండగా.. నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి నీటిని విడుదల చేశారు. నాలుగు రోజులుగా 750 క్యూసెక్కుల నీరు నెట్టెంపాడు ప్రాజెక్టులోకి చేరుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభం కాగా, కృష్ణానదికి వస్తున్న వరదను రిజర్వాయర్లకు మల్లిస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర నదీజలాల బోర్డు గద్వాల జిల్లాలోని ఆర్డీఎస్కు 5.374 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. గతేడాది నికర జలాలతోపాటు వరదను కూడా రికార్డుస్థాయిలో వినియోగించుకున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద పెద్ద ఎత్తున పంటలు సాగయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే వరకు నీటిని విడుదల చేయకపోవడం గమనార్హం. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయింది. వరద కొంచెం ముందుగా వచ్చినా నీటిని రిజర్వాయర్లకు మల్లిస్తున్నారు.
ఆల్మట్టి డ్యాం నుంచి థర్మల్ ప్లాంట్కు..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటిని మల్లిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం శక్తినగర్లో ఉన్న థర్మల్ ప్లాంట్లో నీటిని వినియోగించుకునేందుకు ఆల్మట్టి డ్యాం నుంచి సుమారు రెండు టీఎంసీల నీటిని దశలవారీగా విడుదల చేశారు. ఈ నీరు కృష్ణా నదిలో తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న థర్మల్ ప్లాంట్కు చేరింది. ప్లాంట్ సమీపంలో చేపట్టిన హై లెవెల్ వంతెన నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని నదిలో అడ్డంగా వేశారు. ఈక్రమంలో ఇటీవల ఆల్మట్టి నుంచి నీరు విడుదల కావడంతో వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణ వైపు ప్రవాహం రాగా.. నాలుగు రోజులుగా జూరాలకు ఎగువన వరద స్వల్పంగా పెరిగింది. కాగా ఇరిగేషన్ అధికారులు భీమా, నెట్టెంపాడు రిజర్వాయర్లకు నీరు విడుదల చేశారు.
భీమాకు 400, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు..
కర్ణాటక నుంచి కృష్ణానదికి వరద వస్తుండడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. భీమా ఫేజ్-1లో భాగంగా నారాయణపేట జిల్లా మ క్తల్ నియోజకవర్గంలోని సంగం మండల రిజర్వాయర్కు సుమారు 400 క్యూసెక్కు ల నీటిని మల్లించారు. నది నుంచి గ్రావి టీ ద్వారా పంచదేవ్ పహాడ్ పంప్ హౌ స్ వరకు తరలించి అక్కడి నుంచి సిం గిల్ పంప్ ద్వారా ఖానాపూర్ పంప్ హౌస్కు కాల్వల ద్వారా తరలిస్తున్నారు. అక్కడ పంప్హౌస్లో మో టర్ ఆన్ చేసి సంగంబండ రిజర్వాయర్కు గ్రావిటీ ద్వారా వచ్చి చేరుతున్నది. సంగం మండలం వద్ద కాలువకు గండిపడటంతో వెం టనే అధికారులు మరమ్మతులు చేసి ఆరు గంటల్లోనే మళ్లీ నీటి ని తరలించడం ప్రారంభించా రు. ఇటు నెట్టెంపాడు రిజర్వాయర్కు కూడా జూరాల ఎగువ భాగంలో నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా వి డుదల చేశారు. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా నెట్టెంపాడు రిజర్వాయర్కు నీరు చేరుతున్న ది. ప్రతిరోజూ సు మారు 750 క్యూసెక్కుల నీటిని అధికారులు తరలిస్తున్నా రు. ఈ రెండు రి జర్వాయర్లలో సుమారు మూడు టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటితోపాటు చెరువులకు లింకు ఏర్పాటు చేశారు. వరద ప్రారంభం కాగానే ఈ రెండు ప్రాజెక్టుల కింద ఉన్న అన్ని చెరువులను నింపనున్నారు.
నిరంతరం నీటి తోడివేత
కృష్ణానదికి వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యేల ద్వారా పంప్హౌస్ల వద్ద మోటర్లు ఆన్ చేయించారు. మక్తల్ మండలం పంచదేవ్ పహాడ్, ఖానాపూర్ పంప్హౌస్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మోటర్లను ఆన్ చేసి కాల్వలకు నీటిని విడుదల చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి నెట్టెంపాడు పంప్హౌస్లో అధికారులతో కలిసి మోటర్లను ప్రారంభించారు. ఈ రెండు రిజర్వాయర్లకు నీటిని మల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పెట్టుకోవడం ద్వారా సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కృష్ణానదికి జూన్లోనే స్వల్ప వరద రావడంతో ముందస్తుగా రిజర్వాయర్లకు నీటిని మల్లించడంతో కాలువల్లో జలకళను చూసిన అన్నదాతలు మురిసిపోతున్నారు.