నారాయణపేట, జూలై 19 : మూడు గంటల కరెంట్ ఇస్తానంటున్న కాంగ్రెస్ కావాలా..? నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. రైతులు తేల్చుకోవాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లాలోని మరికల్, ధన్వాడ రైతువేదికల వద్ద కర్షకులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దయ్యాలు తిరిగే టైంలో కాంగ్రెస్ సర్కార్ కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నదని మండిపడ్డారు. గంట సమయంలో ఎక్కడైనా ఎకరా పంటకు నీరందుతుందా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోయిల్సాగర్ ప్రాజెక్టును రూ.32 కోట్లతో మరమ్మతు చేయించామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. కేంద్రం కొర్రీలు పెట్టడం వల్లే రుణమాఫీ ఆలస్యమవుతుందన్నారు. రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
పగలు మూడు గంటలు, రాత్రి దయ్యాలు తిరిగే టైంలో మూడు గంటల కరెంటిచ్చి రైతుల ప్రాణాలను తీసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మండిపడ్డారు. 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.38వేల కోట్లతో విద్యుత్ శాఖను ఆధునీకరించి నేడు సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడిన రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మరికల్, ధన్వాడ రైతువేదికల వద్ద రైతులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ముందు జిల్లాలో 3.69లక్షల ఎకరాల్లో సాగు కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేడు 4లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయన్నారు. 2014 ముందు వరకు కోయిల్సాగర్ కింద రెండు పంటలు పండేది కాదని.. నేడు మరికల్ మండల రైతులు రెండు పంటలు పండిస్తున్నారన్నారు.
ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి తెలంగాణ రాక ముందు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మరమ్మతు కూడా చేయలేదని, బీఆర్ఎస్ వచ్చాక కోయిల్సాగర్కు రూ.32కోట్లతో పనులు చేపట్టిందన్నారు. రూ.75వేల కోట్లు రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయం చేశామని.. ఎల్ఐసీ ప్రీమియం కింద రూ.1,500కోట్లను ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. మరికల్ మండలంలో 245మంది రైతులు చనిపోతే రూ.12.25కోట్లు, ధన్వాడ మండలంలో 137మంది రైతులు చనిపోతే రూ.6.25కోట్లు వారి నామినీల ఖాతాల్లో జమ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రైతులను ఆదుకోవాలని, ఆ తర్వాత తెలంగాణ గురించి మాట్లాడాలని హితవు పలికారు. మూడు గంటల కరెంట్ ఇస్తామన్నా కాంగ్రెస్ కావాలా? 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా? అనేది రైతులు తేల్చుకోవాలన్నారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి తన అహంకారపు మాటలు వీడి చెంపలు వేసుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు రైతుల తరఫున పోరాడుతూనే ఉంటామన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు భీమయ్యగౌడ్, జెడ్పీ వైస్చైర్పర్సన్ సురేఖ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వహీద్, వైస్ ఎంపీపీ రవికుమార్, మరికల్, ధన్వాడ రైతుబంధు సమితి అధ్యక్షులు సంపత్కుమార్, వెంకట్రెడ్డి, సర్పంచులు గోవర్ధన్, అమరేందర్రెడ్డి, మార్కెట్కమిటీ డైరెక్టర్లు మల్లేశ్, సురేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
నోరు ఆదుపులో పెట్టుకో రేవంత్
బాధ్యతాయుమైన పదవిలో ఉండి రైతులను చులకన చేసి మాట్లాడితే కొండగల్ నియోజకవర్గంలోనే రేవంత్రెడ్డిని మట్టి కరిపిస్తరు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువులు, కరెంట్ కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసి అవస్థలు పడ్డాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే మాకు 24 గంటల కరెంట్ వస్తున్నది. అన్నదాతను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.
– గౌని శ్రీనివాసులు, రైతు, ఎంనోనిపల్లి
కర్షకులతో పెట్టుకుంటే కాటికే..
కర్షకులతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ కాటికే పోతుంది. ఉచిత కరెంటుపై అహంకారంగా మాట్లాడిన రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి. మీ పాలనలో రాత్రి పూట పొలం కాడ ఉంటేనే ఎకరా భూమి కూడా పారలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే మాకు 24 గంటల కరెంట్ వస్తోంది. ఇప్పుడు రాత్రి వేళ ఇంట్లోనే నిద్రపోతున్నం. మాకు పాత రోజులు వద్దు.. కేసీఆర్ ప్రభుత్వం రైతులపై ప్రేమ చూపుతున్నది. కాంగ్రెస్ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నది. ఆ పార్టీకి కాలం చెల్లింది. జాగ్రత్త రేవంత్.. మాతో పెట్టుకుంటే మీరు కాటికి పోతారు బిడ్డ.
– కృష్ణారెడ్డి, రైతు ,అప్పంపల్లి