బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మంచి నటుడే కాదు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి పలు సాయాలు చేసి వారి మనసులు గెలుచుకున్నాడు. తాజాగా ఫ్రంట్ లైన్ వర్కర్స్కు ఆహార వస్తు సామాగ్రిని పంపిణీ చేయడం ప్రారంభించాడు. యువసేన నాయకుడు రాహుల్ కనాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఆయన మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, బీఎంసీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు సల్మాన్ను కదిలించాయి. లాక్డౌన్ వలన చాలా షాపులు మూసివేయడం వలన వారు పడుతున్న ఇబ్బందులు సల్మాన్ను కదిలించాయి.
దీంతో కరోనా పోరాట యోధులకు సాయం అందించేందుకు ఫుడ్ ట్రక్కులు రోడ్లపైకి వచ్చాయి. ఆహార ప్యాకేజీలను పంపిణీ చేయడానికి మూడు వారాల ప్రణాళికను రూపొందించినట్లు కనాల్ తెలిపారు. భోజన వస్తు సామగ్రిలో టీ, మినరల్ వాటర్, ఒక ప్యాక్ బిస్కెట్లు మరియు ఉప్మా లేదా పోహా లేదా వడా పావ్ లేదా పావ్ భాజీ వంటి స్నాక్స్ ఉన్నాయి. అలానే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఓ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ప్రారంభించగా, తమ సేవ కావాలనుకునే వారు ఈ నెంబర్కు కాల్ చేస్తే వారి ప్రాంతానికి వెళ్లి సాయం చేయనున్నార. మే 15 వరకు ఆహార పంపిణీ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం సల్మాన్ చేతిలో ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’, ‘కిక్ 2’, ‘టైగర్ 3’ వంటి చిత్రాలు ఉన్నాయి.