అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం ఊపందుకున్నది. 3న నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మందకొడిగా సింగిల్ డిజిట్కే పరిమితమైన నామినేషన్లు బుధవారం జోరందుకున్నాయి. ఒక్కరోజే నాగర్కర్నూల్ జిల్లాలో 18 దాఖలయ్యాయి. వీరిలో ముగ్గురు బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముందుగా జినుకుంటలో కనకాల మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేశారు. వట్టెం వెంకన్న ఆలయంలో నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ హైదరాబాద్లోని కనకదుర్గమ్మ, మైసిగండి మైసమ్మ తల్లికి పూజలు చేశారు. కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ తరఫున మర్రి జమున కూడా నామినేషన్ వేశారు. ఇప్పటికే కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి.
నాగర్కర్నూల్, నవంబర్ 8 : నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి బుధవారం బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. మొదటగా మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్రెడ్డికి నామినేషన్ అందజేశారు. అనంతరం ముఖ్యనాయకులతో కలిసి రెండో నామినేషన్ వేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరఫు నుంచే ఎమ్మెల్యే సతీమణి మర్రి జమున కూడా ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే మర్రి దంపతులు, మర్రి జమున, నాగం తనయుడు నాగం శశిధర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డిలతో కలిసి వట్టెం వెంకన్న ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మర్రి దంపతులు నాగం జనార్దన్రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ గత పదేండ్లలో తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి తన గెలుపునకు నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 25 ఏండ్లుగా అన్ని రంగాల్లో నాగర్కర్నూల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాగం జనార్దన్రెడ్డితోపాటు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అనంతరం ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. గత 25 ఏండ్లుగా నాగం జనార్దన్రెడ్డి, పదేండ్లుగా తాను ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధికి బాట లు వేశామన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం రంగాలను అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈప్రాంతంపై అవగాహన లేదని, అలాంటి వారికి ఓటు వేసి మోసపోవద్దన్నారు. పదేండ్లుగా తాను ఎమ్మెల్యేగా ఉండి ఈప్రాంతంపై అవగాహన పెంచుకొని అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు. అవగాహన లేని వారికి ఓటువేసి మోసపోకుండా అభివృద్ధి చేసేవారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, జక్కా రఘునందన్రెడ్డి, నాగం శశిధర్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య తదితరులు ఉన్నారు.
తిమ్మాజిపేట, నవంబర్ 8 : బీఆర్ఎస్ ప్రభు త్వం పదేండ్లుగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధా న్యం ఇచ్చిందని, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని మరోసారి ఆదరిస్తే నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం తిమ్మాజిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, ఆసరా పింఛన్లు పెంచడంతోపాటు మహిళలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. అదే విధంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వివరించారు. ప్రజలందరూ బీఆర్ఎస్ను ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, సర్పంచ్ వేణుగోపాల్, ఎంపీటీసీ లీలావతితోపాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కల్వకుర్తి, నవంబర్ 8 : బీఆర్ఎస్ అభ్యర్థి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బుధవారం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి రెండు సెట్లు అందజేశారు.
నామినేషన్కు ముందు హైదరాబాద్ కర్మన్ఘాట్లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత ఉంచారు. అమ్మవారి సన్నిధిలో దరఖాస్తు ఫారాలో తన వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు. అంతకు ముందు తన తల్లిగారి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కడ్తాల మైసిగండి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా కల్వకుర్తి చేరుకున్నారు. కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా తాసీల్దార్ కార్యాలయం వరకు వచ్చారు. తాసీల్దార్ కార్యాలయం ఎదుట అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించారు. అదేవిధంగా తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, జెడ్పీటీసీ సభురాలు విజితారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి రెండు సెట్లు నామినేషన్ దరఖాస్తులను ఆర్వో శ్రీనుకు అందజేశారు.
ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం నామినేషన్ వేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడారు. కల్వకుర్తి నియోజవర్గంలో దాదాపు రూ. 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని చె ప్పారు. 164 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో పెద్ద ఎ త్తున అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పా రు. కల్వకుర్తిలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేయించానని, కల్వకుర్తి నియోజకవర్గాన్ని విద్యాహబ్గా మార్చానని చెప్పారు. ముఖ్యమం త్రి కేసీఆర్కి కల్వకుర్తి అంటే అమితమైన ప్రేమ అని, కల్వకుర్తి అభివృద్ధికి అడిగిన వెంటనే నిధు లు మంజూరు చేశారని అన్నారు. మరో సారి అవకాశం ఇవ్వాలని, ఆశీర్వదించి అసెంబ్లీకి పం పిస్తే అభివృద్ధిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెడతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీపై 9వ తరగతి విద్యార్థి అంతులేని అభిమానాన్ని చాటుకున్నాడు. ల్యాప్టాప్ కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను విద్యార్థి హృతికేశ్ రూ.2 లక్షల వరకు పోగు చేసుకున్నాడు. కాగా, ఈ డబ్బులను రాజకీయ అవసరాల కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు అందజేశాడు. అనంతరం హృతికేశ్ తల్లిదండ్రులు బావండ్ల మధు, మంజులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
అచ్చంపేట, నవంబర్ 8: అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గువ్వల బాలరాజు ఆరాధించే జీన్కుంట కనకాల మైసమ్మ ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం జిల్లా రైతు సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, మాజీ జెడ్పీటీసీ మాకం తిర్పతయ్య, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, అమ్రాబాద్ మండలపార్టీ అధ్యక్షులు రవీందర్రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారి గోపిరాంకు నామినేషన్ పత్రాలు అందించారు. గువ్వల బాలరాజు రెండో నామినేషన్ సెట్ను ఈ నెల 10న శుక్రవారం దాఖలు చేయనున్నారు. భారీర్యాలీతో నామినేషన్ వేయనున్నారు.
బల్మూరు, నవంబర్ 8 : మండలంలోని జినుకుంట గ్రామంలోని కనకాల మైసమ్మ ఆలయంలో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నామినేషన్ పత్రాలను అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం సహకారంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని పేర్కొన్నారు. అనంతరం రామాజిపల్లి, జీనుకుంట, తుమ్మెన్పేట గ్రామలకు చెందిన వారు గువ్వల సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కరుణాకర్రావు, ఎంపీటీసీలు ఆంజనేయలు, లక్ష్మీదేదమ్మ, సర్పంచులు రవిచంద్రారెడ్డి, పద్మ, నాయకులు ప్రేమ్రావు, పీజేఆర్, రాజేశ్వర్రెడ్డి, బాలస్వామి తదితరులు ఉన్నారు.