కొల్లాపూర్, జనవరి 5 : ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు సింగవట్నంలో లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఆలయ ఆవరణలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా జాతరలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో జాతరలో విధులు నిర్వహించిన సిబ్బంది కంటే మూడింతలు పెంచాలని ఆదేశించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తుండడంతో దేవాదాయ, ఇతర అధికారులు అంతా సన్నద్ధం చేసుకోవాలని జాతరలో పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని,జాతర ప్రాంగణంలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రెవె న్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఎక్సైజ్, అగ్నిమాపక, వైద్యారోగ్యశాఖ అధికారులతో శాఖల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కొల్లాపూర్ డిపోకు నూతనంగా వచ్చిన ఎక్స్ప్రెస్ బస్ను మంత్రి ప్రారంభించి అదే బస్సులో సింగవట్నం వరకు ప్రయాణించారు. కార్యక్రమంలో అదనపు రెవెన్యూ కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో నాగరాజు, డీఎస్పీ మోహన్కుమార్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ రఘునాధ్రావు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సంపత్కుమార్శర్మ, ఈవో రంగారావు, డీఎంహెచ్వో సుధాకర్లాల్, అడిషనల్ డీఎంహెచ్వో వెంకట్దాస్, తాసీల్దార్లు శ్రీకాంత్, హిమబిందు, ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, జెడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ, సర్పంచ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి, జనవరి 5 : ప్రజాభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సర్పంచ్ సువర్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులందరూ ఆరు గ్యారెంటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులే మీ గ్రామాలకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, తాసీల్దార్ హిమబిందు, ఎంపీవో భరత్ పాల్గొన్నారు.
కొల్లాపూర్, జనవరి 5 : విద్య జీవితంలో పరిపూర్ణత సాధించడానికి దోహదపడుతుందని, చదువు కేవలం జీవితంలో విజయం సాధించడానికి కాదని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు గ్రామీణ, గిరిజన క్షేత్ర పరిశీలన కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని శుక్రవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మంత్రి మాటాడుతూ ప్రశ్నించే తత్వం, ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం, సృజనాత్మక, ఊహాత్మక భావస్వేచ్ఛ వంటి వాటిని అలవర్చుకోవాలని సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలో మంత్రి జూపల్లి మార్నింగ్ వాక్ చేశారు. పట్టణంలో పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజలను పలుకరిస్తూ, సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తక్షణం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొల్లాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 9మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ చేస్తూ మంత్రి ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటరమణమ్మ, సూపర్వైజర్లు పాల్గొన్నారు.