మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 4 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మలేరియా, డెంగీ వ్యాధి నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల కారణంగా మలేరియా, డెంగీ వంటి వ్యాధులు సోకుతాయని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య అధికారులు ప్రజలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీనిపై మున్సిపల్, మలేరియా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ఉన్న పాత కలెక్టరేట్ స్థానంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నదని చెప్పారు. జిల్లా కేంద్రంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు. జిల్లాలో ఇటీవలే రెండు కోట్ల విత్తన బంతులతో అతి పెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందని గుర్తు చేశారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. అంతకు ముందు తిమ్మసానిపల్లి, పిల్లల మర్రి రోడ్డులో హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, డీఎంహెచ్ డాక్టర్ కృష్ణ, జిల్లా మలేరియా అధికారి విజయ్ కుమార్, కౌన్సిలర్లు షబ్బీర్ అహ్మద్, అనంతరెడ్డి, షేక్ఉమర్, పటేల్ ప్రవీణ్, గోవిందు, కట్టా రవికిషన్రెడ్డి, మునీర్, నర్సింహులు, వేదవత్, మోతీలాల్, రామ్, చెన్నవీరయ్య, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రామలింగం, జ్యోతి, నాయకులు కృష్ణమోహన్, మోసీన్, ప్రశాంత్, రవి పాల్గొన్నారు.
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు చేయూత
మహబూబ్నగర్, ఆగస్టు4: కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన చిన్నారులను చదివించడంతోపాటు వారు జీవితంలో స్థిరపడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.17,59,500 విలువ చేసే చెక్కులను 39మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఐదుగురు దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వులను అందజేశారు. కొవిడ్తో తల్లిదండ్రులు లేకుండా అనాథగా మిగిలిన నలుగురు చిన్నారులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.2 వేల చొప్పున మూడు నెలలకు రూ.6వేల స్కాలర్షిప్లు, హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన రావుల వెంకటేశ్ విద్యాదాఘాతంతో చనిపోగా విద్యుత్ శాఖ తరుఫున రూ.4 లక్షల విలువైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పేదలకు జబ్బు చేస్తే ఆస్తులను తాకట్టు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కొవిడ్తో మరణించిన తల్లిదండ్రులు చనిపోయిన వారి జాబితాను అధికారులు రూపొందించాలని సూచించారు. ఆడపిల్లలు అయితే వారిని చదవించడంతోపాటు పెండ్లి చేసే వరకు అండగా ఉంటామన్నారు. మగ పిల్లలు ఉంటే వారు జీవితంలో స్థిరపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
గోపాల్యాదవ్ సేవలు చిరస్మరణీయం
జిల్లా కేంద్రంలోని గొర్రెల పెంపకదారుల సహకార సంఘం భవనంలో గోవర్ధన్ యాదవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, వెంకట నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటూ ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి క్షణం పేదలకు మేలు చేయాలనే సంకల్పంతో అడుగులు వేయాలని సూచించారు. గోవర్ధన్ యాదవ్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ యాదవ్, శాంతన్నయాదవ్, సాయిలుయాదవ్, సావిత్రి, వెంకటేశ్ యాదవ్, రాందాస్యాదవ్, రాజుయాదవ్, శ్రీనివాస్ యాదవ్, నరసింహ, తిరుపతయ్య యాదవ్, కోట్ల నర్సింహులు, సురేందర్ యాదవ్ పాల్గొన్నారు.