అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్నది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మద్దతుగా సకుటుంబ సపరివార సమేతంగా ఆయా సెగ్మెంట్లలోని క్యాంపేయిన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. పతుల కోసం సతులు.. ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారంలో దూకుడు పెంచారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ భార్య శారద, కూతుళ్లు శ్రీహిత, శ్రీహర్షిత, జడ్చర్లలో లక్ష్మారెడ్డి కుమారుడు స్వరణ్రెడ్డి, దేవరకద్రలో ఆల సతీమణి మంజుల, కూతురు ప్రీతి, నారాయణపేటలో రాజేందర్రెడ్డి భార్య స్వాతిరెడ్డి, మక్తల్ సెగ్మెంట్లో చిట్టెం సతీమణి సుచరితారెడ్డి, కుమారుడు చాణక్యారెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఓటర్లతో కలిసిపోతున్నారు. గెలుపే లక్ష్యంగా నిత్యం పల్లె, పట్నం అన్న తేడా లేకుండా చేరుతున్నారు. గడపగడపనూ సందర్శించి.. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని జనానికి వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
– మహబూబ్నగర్/జడ్చర్ల/మూసాపేట/నారాయణపేట/ఊట్కూర్, నవంబర్ 14
వనపర్తి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో తమ పతులు గెలుపు కోసం వారి సతులు నడుం బిగించి గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భార్య సింగిరెడ్డి వాసంతి నెల రోజులుగా పలు గ్రామాల్లో రాత్రి పూజ పల్లెల నిద్రలతో అక్కడి గ్రామాల్లోని ఆవాసాల్లోనే బస చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ పట్టుదలగా పని చేస్తున్నారు. మర్నాడు ఉదయం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. సతులే కాకుండా వారి కూతుళ్లు , అల్లుడు సహితం తామేం తక్కువ కాదంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నికల మ్యానిఫెస్టోను వివరిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భార్య సింగిరెడ్డి వాసంతి గ్రామాల్లో జోరుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నెల రోజులకు పైబడి వాసంతి గ్రామాల్లో పర్యటిస్తూ మంత్రి సింగిరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని పెబ్బేరు, శ్రీరంగాపురం, గోపాల్పేట, రేవల్లి, వనపర్తి, పెద్దమందడి మండలాల్లో సింగిరెడ్డి వాసంతి ప్రచారాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
వివిధ మండలాల్లో సింగిరెడ్డి వాసంతి పల్లె నిద్రలు చేపట్టి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు, నాయకుల ఇండ్ల్లలోనే రాత్రిపూట బస చేస్త్తూ అక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడటం..వాటిని అవసరమనుకుంటే తక్షణమే చేయించడంలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పెబ్బేరు మండలం సూగూరుతో పల్లెనిద్రను ప్రారంభించిన సింగిరెడ్డి వాసంతి ఇటీవలే గోపాల్పేట మండలం బుద్దారంలో పల్లెనిద్రను నిర్వహించారు. ఇలా దాదాపు 20గ్రామాల్లో పల్లె నిద్రలు చేపట్టగా, మరికొన్ని గ్రామాల్లో మార్నింగ్ వాక్లు కూడా చేస్తూ ఎక్కువ గ్రామాలను తిరిగే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రి సింగిరెడ్డి కూతుళ్లు , అల్లుడు సహితం నిరంజన్రెడ్డి గెలుపు కోసం కఠోరంగా శ్రమిస్తున్నారు. పెద్ద కూతురు డాక్టర్ ప్రత్యూష ఖిల్లాఘణపురం మండలంలో పర్యటిస్తున్నారు. మరో కూతురు తేజశ్విని శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అలాగే అల్లుడు వంగూర్ ప్రమోద్పెడ్డి వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి ముమ్మరంగా నియోజకవరంలో పర్యటిస్తూ మంత్రి గెలపునకు కృషిచేస్తున్నారు. 20రోజుల నుంచి తల్లి, కూతు ళ్లు, అల్లుడు మంత్రి నిరంజన్రెడ్డి గెలుపు కోసం ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 14 : దశాబ్దాల తరబడి మహబూబ్నగర్ జరుగని అభివృద్ధి కేవలం పదేండ్లలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చేసి చూపించారని వివరిస్తూ ఆయన సతీమణి శారద ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఆమె మహబూబ్నగర్ నియోజకవర్గంలోని పట్టణంలోని 49 వార్డులతోపాటు హన్వాడ, మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలో దాదాపు అన్ని గ్రామాల్లో ఇంటిటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, ఎన్నికల మ్యానిఫెస్టోను వివరిస్తూ కారుగుర్తుకు ఓటేసి మరోసారిక బీఆర్ఎస్ను ఆదరించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లినప్పుడు బీఆర్ఎస్కు విశేష స్పందన వస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలు మంత్రి శ్రీనివాస్గౌడ్ను గుండెల్లో పెట్టుకుని ఆరాదిస్తున్నారన్నారు. ఏ గడపను తట్టినా అడగకముందే మా ఓట్లన్ని కారు గుర్తుకే అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారన్నారు. మహబూబ్నగర్ను మరింత అభివృద్ధి చేయాలి..ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే మంత్రి శ్రీనివాస్గౌడ్ పరితపిస్తుంటారన్నారు. గిప్పుడు చూస్తుంటే ప్రజల నుంచి వస్తున్న ఆదారణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ కూతుళ్లు శ్రీహిత, శ్రీహర్షిత, మంత్రి తమ్ముడి భార్య రాధిక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు గ్రామాల్లోనూ విస్తృతంగా పర్యటించి కారుగుర్తు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలే కుటుంబంగా భావించి నిత్యం అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గడపగడపకు తిరిగుతూ మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తూ తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), నవంబర్ 14 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నచింతకుంట మండలంలో అమ్మాపూర్ గ్రామ సమీపంలో గల సప్తగిరుల మధ్యన కాంచన గుహలో కొలువు తీరిన వేంకటేశ్వర స్వామి ప్రతి రూపమైన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు ఆవాహిత దేవతాపూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వాన భేరీపూజ, అష్టోత్తరశతనామాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ముస్తాబు చేసిన పల్లకీలో ఆలయ గర్భగుడి ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మధ్య మంగళవాయిద్యాలు, భక్తుల సందడిలో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం స్వామి వారికి మయూరవాహన సేవ, శాత్తుమురై, మంగళనీరాజనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవాలను తిలకించిన భక్తులు పునీతులయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి మదనేశ్వర్రెడ్డి, ప్రధాన అర్చకులు వెంకటేశ్వరచార్యులు, పాలక మండలి చైర్మన్ ప్రతాప్రెడ్డి, సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఊట్కూర్, నవంబర్14: మక్తల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి చిట్టెం సుచరిత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 20 ఏండ్లకు పైగా భర్త చిట్టెం రామ్మోహన్రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్న ఆమె పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రైతు బంధు సమితి ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యురాలుగా పని చేస్తున్న ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను , యాభై ఏండ్లుగా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చిట్టెం కుటుంబం చేస్తున్న కృషిని ప్రజలకు వివరిస్తూ మరోసారి చిట్టెం రామ్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తన వాగ్ధాటితో ప్రతిపక్ష పార్టీల విమర్శలను చిత్తు చేస్తున్నారు. 2018 ఎన్నికల ప్రచారంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె భర్త భారీ మెజార్టీ సాధించేందుకు కృషి చేశారు. మరో పక్క ఇంటి వద్దకు వస్తున్న కార్యకర్తలు, అభిమానులకు భోజన వసతి చూసుకోవడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో భర్త రామ్మోహన్రెడ్డి విజయబావుటా ఎగురవేసేందుకు వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే చిట్టెం కుమారుడు చాణక్యరెడ్డి నియోజకవర్గంలో యువతీ, యువకులను కలిసి బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
నారాయణపేట, నవంబర్ 14: నారాయణపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి స్వాతిరెడ్డి గడప గడపకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేపడ్తున్నారు. ఆలోచించండి.. ఎల్లపుడూ అందుబాటులో ఉండే వారిని గుర్తించండి.. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను ఆదరించాలని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నెల రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టి నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తొమ్మిదిన్నరేండ్లలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చేపట్టిన అభివృద్ధ్ది కార్యక్రమాలతోపాటు మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వివరిస్తున్నారు. ఒకవైపు కాళ్ల నొప్పులు బాధిస్తున్నా నెల రోజులుగా అవిశ్రాతంగా ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా భర్త గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేపట్టిన ఆమెకు ఇంటింటి ప్రచారంలో జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 24వార్డుల్లో మొత్తం 9వేల ఇండ్లకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నారాయణపేట మున్సిపాలిటీలో ప్రచారం ముగిసిన తర్వాత మరికల్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఆమె వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి తన అన్న ఎస్.రవీందర్రెడ్డి ప్రతి ఎన్నికల్లో తోడుగా నిలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా కోయిల్కొండ మండలంలో విస్త్రృత ప్రచారం చేపడుతున్నారు. అలాగే నియోజకవర్గ నాయకులను సమన్వయం చేస్తూనే మరో పక్క పూర్తి స్థాయిలో మండల బాధ్యతలను చూస్తున్నారు.