మంత్రి శ్రీనివాస్గౌడ్ పేదల తిరుపతి మన్యంకొండ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శనివారం మన్యం కొండ ఆర్చి నుంచి ఆలయం వరకు నిర్మించిన బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, చెరువు కట్ట అభివృద్ధి, స్నాన ఘట్టం, భక్తుల కోసం నిర్మించిన వసతి గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఏడాదికి రోప్వేను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆలయ, అటవీ భూముల్లోని ఇంచును కూడా అన్యాక్రాంతం కానివ్వమని చెప్పారు. ఈ ప్రాంతంలో 10 లక్షల మొక్కలు నాటి భూములను కాపాడుకుంటామన్నారు. పెద్ద ఎత్తున కల్యాణ మండపాలు నిర్మిస్తామని చెప్పారు.
పాలమూరు, ఫిబ్రవరి 4: తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన, 800ఏండ్ల చరిత్ర ఉన్న మన్యంకొండ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మంత్రి మన్యంకొండ ఆర్చీ నుంచి ఆలయం వైపునకు రూ.4.79కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ డబుల్రోడ్డు, డబుల్రోడ్డు వెంట రూ.52లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, ఆలయం ముఖద్వారం వద్ద రూ.27.65లక్షలతో నిర్మించిన చెరువుకట్ట అభివృద్ధి పనులు, స్నానాలఘట్టాన్ని, రూ.2.2కోట్ల వ్యయంతో నిర్మించిన 18వసతి గృహాల సముదాయాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. దేవాదాయశాఖలో అత్యుత్తమ గ్రేడ్ ఉన్న మన్యంకొండ ఆలయాన్ని ఏటా దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. డబుల్రోడ్డు, సెంట్రల్ లైటింగ్, స్నానాలఘాట్, వసతిగృహాలు నిర్మించామన్నారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి రాష్ట్రంలో తొలిసారిగా ఇక్కడే రోప్వే నిర్మాణాన్ని పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు. ఒకేసారి అనేక పెండ్లిళ్లు చేసేలా కల్యాణ మండపాలు నిర్మిస్తామన్నారు. దిగువన అలువేలుమంగతాయారు ఆలయం సమీపంలో నిర్మించే త్రీస్టార్ హోటల్ భక్తులు, పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
వంశపారంపర్యంగా అలహరి కుటుంబం ఆలయాన్ని కాపాడుతూ వస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. 10లక్షల మొక్కలు నాటి ఆలయ, అటవీ భూములను కాపాడుకుంటామని, ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాలకు అద్భుతంగా ఏర్పాట్లు చేసిన దేవాలయ పాలకమండలి సభ్యులను, అధికారులను మంత్రి అభినందించారు. భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, సింగిల్విండో చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, మన్యంకొండ దేవాలయ ధర్మకర్త మధుసూదన్, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, వైస్ఎంపీపీ అనిత, సర్పంచ్ చంద్రకళ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, ఆలయ పాలకమండలి సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
గద్వాలటౌన్, ఫిబ్రవరి 4: గద్వాల కోటలో కొలువుదీరిన భూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి లింగంబావిలో స్వామివారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను హనుమత్ వాహనంపై ఊరేగించారు. మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవానికి మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే హైకోర్టు జడ్జిలు, జిల్లా జడ్జిలు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహిళలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.