అచ్చంపేట, జూలై 14: నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఐదుసార్లు ఓడినా బుద్ధిమారలేదన్నారు. వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెడ్డీలపై చేసిన ఆగడాలు, దౌర్జన్యాలు మర్చిపోలేదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని టీఆర్ఎస్ రెడ్డి సామాజికవర్గం ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ సీఎంరెడ్డి, పాలశీతలీకరణ కేంద్రం చైర్మన్ గోపాల్రెడ్డి, ఉప్పునుంతల జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, లింగాల, వంగూరు పీఏసీసీఎస్ చైర్మన్లు హన్మంతురెడ్డి, సురేందర్రెడ్డి, అమ్రాబాద్, బల్మూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్రెడ్డి, చుక్కారెడ్డి, పెనిమిళ్ల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి, అమ్రాబాద్ నాయకులు సుధాకర్రెడ్డి మాట్లాడారు. రెడ్డీలకు ఉన్నత పదవులు ఇచ్చి అధిక ప్రాధాన్యత కల్పించి ఏ ఆపద వచ్చినా అండగా నిలబడుతున్న నిస్వార్థపరుడు, ముక్కుసూటి తనం, నిక్కచ్చిగా వ్యవహరించే గువ్వల బాలరాజుపై రాజకీయంగా రెడ్డీల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తూ లేనిపోని అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
కొత్తకుంటపల్లిలో అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దని చెప్పడానికి జ్ఞానేశ్వర్రెడ్డికి ఏం సంబంధమని, గౌరవమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యేను ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని ఖండించాల్సింది పోయి తిరిగి గ్రామంలో కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఘటనను భూతద్ధంలో పెట్టి రాజకీయంగా రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకోవడం నీచమైన దిగజారుడుకు నిదర్శనమన్నారు. జ్ఞానేశ్వర్రెడ్డిపై గతంలో దాడి జరిగితే ఇంటికి పిలిచించి క్షమాపణ చెప్పించారన్నారు. గువ్వల బాలరాజు పనితీరు, కష్టపడేతత్వం, ముక్కుసూటితనం, ఆపదలో సాయం చేసే గుణం ఉన్నందునే ఎక్కువ మొత్తంలో రెడ్డీలు టీఆర్ఎస్, ఎమ్మెల్యే వెంట ఉన్నారన్నారు.
బల్మూర్ మండలం చెన్నారంలో ఓ కేసులో 22మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి జైలుకు పంపించిన చరిత్ర వంశీకృష్ణది కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సకలజనుల సమ్మెలో ఉప్పునుంతల గోపాలరెడ్డిపై వంశీకృష్ణ అనుచరులు దాడిచేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలోని రెడ్డినాయకులు ఎందుకు ఖండించలేదన్నారు. సొంతపార్టీ నాయకుడు అచ్చిరెడ్డిపై దాడిచేయించింది మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. రెడ్డీలు కాంట్రాక్టు పనులు చేయకుండా భయపెట్టి పనులు గుంజుకున్నారని, కాంట్రాక్టర్ల వద్ద కమీషషన్లు తీసుకొని రెడ్డీలను ఇబ్బందులకు గురిచేసింది వంశీకృష్ణ అన్నారు. వంశీకృష్ణ దౌర్జన్యాలు, నీచమైనపనులు ప్రజలకు తెలియదా?, రెడ్డీలను ఇబ్బందులకు గురిచేసిన కారణంగానే వంశీకృష్ణను ఓడగొట్టారన్నారు. మా నాయకుడి ముందు వంశీకృష్ణనా, సతీశ్మాదిగనా తేల్చుకోవాలన్నారు. అచ్చంపేటలో గువ్వల బాలరాజుకు ఎమ్మెల్యే కాకముందే అచ్చంపేటలో సొంత ఇల్లు ఉందన్నారు.
లోకల్ అనే వంశీకృష్ణకు అచ్చంపేటలో కనీసం ఇల్లు కూడా లేదన్నారు. గువ్వల బాలరాజును స్థానికుడు కాదని చెప్పే వంశీకృష్ణ పక్క నియోజకవర్గానికి వెళ్లి దవాఖాన ఎందుకు పెట్టుకున్నాడని మండిపడ్డారు. రెడ్డిలజోలికి వస్తే ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు తమస్వార్థం కోసం రెడ్డి కులాల మధ్య రాజకీయం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. రెడ్డివర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించి అండగా నిలబడుతున్న గువ్వల బాలరాజును వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుని తీరుతామన్నారు. ప్రజల కోసం పనిచేసే ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జ్ఞానేశ్వర్రెడ్డి ఘటనలో గువ్వల బాలరాజుపై కాంగ్రెస్నాయకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. గువ్వల పనితీరు చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజల పట్టించుకోరన్నారు.