మహబూబాబాద్, మే 16 : మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పూరితండా, బోడగుట్టతండా, సీత్లాతండా, వేంనూరు గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. గుడుంబా తయారు చేసే వారిని మొత్తం 13మందిని బైండోవర్ చేసి, 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పూరితండా, బోడగుట్టతండా, సీత్లాతండా, వేంనూరు గ్రామాల్లో గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారంతో ఆయా ప్రాంతాల్లో దాడులు చేసి 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అందుకు బాధ్యులైన 13 మందికి గాను 11 మందిని మహబూబాబాద్ తహసీల్దార్ ఎదుట, మరో ఇద్దరిని కురవి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు వివరించారు. ఒక్కో వ్యక్తికి రూ.2లక్షల సొంత పూచీకత్తుపై విడుదల చేశామన్నారు. మళ్లీ గుడుంబా తయారు చేస్తే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం వారి నుంచి రూ.2 లక్షల జప్తుతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. అనంతరం వారికి గుడుంబా తయారు చేయొద్దని అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు హరీశ్, కృష్ణమూర్తి, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.
డోర్నకల్లో 15 లీటర్ల గుడుంబా స్వాధీనం
డోర్నకల్: డోర్నకల్ పోలీసులు సోమవారం 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఇస్లావత్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. లింబ్యాతండా శివారులో లచ్చ తండాకు చెందిన ఇస్లావత్ బూరీ, లచ్చు, ధరంసోత్ లక్ష్మి, వ్యవసాయ క్షేత్రం వద్ద గుడుంబా తయారీ చేసుకొని వస్తున్న క్రమంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణకు పట్టుబడ్డారు. వారి నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని, ముగ్గురిపై ఎస్సై వాంకుడోత్ భద్రూనాయక్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.