డోర్నకల్, మార్చి16: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిలుకోడు, బొడ్రాయి తండా జీపీలు, మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్డు, వైకుంఠధామం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలుకోడు జీపీలో వైకుంఠధామం పనులు పూర్తి కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 28వ తేదీ లోపు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ను ఆదేశించారు. అనంతరం బొడ్రాయి తండా నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్ తేజావత్ గమ్మిరాజు, కార్యదర్శి ప్రవీణను అభినందించారు. తర్వాత మున్సిపాలిటీలోని టీయూఎఫ్డీసీ రూ.20 కోట్ల నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఏఈని ఆదేశించారు. లేదంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు.
యాదవ్నగర్లో వైకుంఠధామాన్ని పరిశీలించారు. సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు వారం రోజుల్లో ప్రారంభించాలని అన్నారు. అమ్మపాలెం, కస్నాతండా, హూన్యతండా జీపీల్లో వైకుంఠధామం పనులు పూర్తి కాకపోవడంతో సర్పంచ్లు, కార్యదర్శులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. వారం పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పనులపై రోజువారీ నివేదికను సమర్పించాలని ఎంపీడీవోను ఆదేశించారు. జీపీ నర్సరీల్లో 100 శాతం మొక్కల పెంపకం పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, మున్సిపల్ ఇన్ చార్జి కమిషనర్ కే.వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ కిషోర్ బాబు, మున్సిపాలిటీ ఏఈ భిక్షపతి, సర్పంచ్లు రాయల వెంకట్బాబు, గమ్మిరాజు, ధరంసోత్ రాంబాయి, దేవి, బాణోత్ రాంబాయి, వార్డు కౌన్సిలర్లు జనార్దన్, శరత్, అశోక్, చంద్రశేఖర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రాంభద్రం,అజిత్ మియా పాల్గొన్నారు.