గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో భాషే వారికి ఆధారభూతంగా నిలుస్తున్నది. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉన్నది. భాషా, లిపి లేని కారణంగా అనేక గిరిజన తెగలు అంతరించిపోతున్నాయి.
దేశంలో అనేక మాతృభాషల మనుగడ సన్నగిల్లడంతో మొత్తం 705 తెగలకు గానూ సుమారు 300 భాషలుండగా రోజురోజుకు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో గిరిజనులు మాట్లాడే సవర భాష వాటిలో ఒకటి. సవర భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి ఎనలేని కృషి చేశారు. ఓవైపు ఆదిమగిరిజనుల సవర భాషపై నిరంతరం పరిశోధనలు చేస్తూ.. సవర లిపిని, నిఘంటువును రూపొందించి, మరోవైపు తెలుగు వాడుక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వ్యావహారిక భాషా వ్యాప్తికి కృషి చేసిన గిడుగు.. గ్రాంథిక భాషావాదుల పాలిట ‘పిడుగు’ అని కీర్తిప్రతిష్టలందుకున్న ఘనాపాటి. తెలుగు భాషకు గిడుగు చేసిన కృషిని గుర్తించి ఆయన జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
ఒడిశా సరిహద్దులో పర్లాకిమిడి పట్టణం చుట్టుపక్కల కొండలపై నివసిస్తున్న సవర తెగ గిరిజనులపై గిడుగు దృష్టి పెట్టారు. గిడుగు సవరలపై దృష్టి పెట్టడం వెనుక వారి వెనుకబాటుతనంతో పాటు చారిత్రక నేపథ్యం కూడా దాగున్నది. నాటి రామాయణం, మహాభారతం, వైదిక సూత్రాల్లో సవరల ప్రస్తావన ఉన్నది. అందుకు శబరి నిదర్శనం. శ్రీరాముని సేవకురాలు శబరి కూడా సవర తెగకు చెందిన మహిళే. పూర్వం శబరులు ఆదిమ సవర గిరిజనులు అని ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నది.
సవర గిరిజనుల అభివృద్ధిని కాంక్షించిన గిడుగు వారిని తొలుత చదువుబాట పట్టించాలని సంకల్పించారు. మాతృభాషలోనే వారికి విద్య నేర్పించారు. ప్రత్యేకంగా పాఠశాలలు నెలకొల్పారు. గిడుగు రచించిన సవర వాచకాలు, కథల పుస్తకాలు, పాటల పుస్తకాలు, తెలుగు – సవర, సవర – తెలుగు నిఘంటువులను 1911లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ప్రచురించింది. ఆయన కృషిని కొనియాడుతూ అప్పటి ప్రభుత్వం పారితోషికం ఇవ్వజూపగా.. ‘ఆ డబ్బుతో పాఠశాల నెలకొల్పండి’ అని ప్రభుత్వాన్ని గిడుగు కోరారు. గిడుగు చేసిన కృషికి గానూ ప్రభుత్వం 1913లో ‘రావు సాహెబ్’ బిరుదుతో సత్కరించింది.
సవర భాషలో ‘ఏ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజెస్’ వ్యాకరణాన్ని 1930లో గిడుగు రాశారు. అమెరికాలోని హవాయి విశ్వవిద్యాలయం పాశ్చాత్య భాషావేత్త స్టాన్లీ స్టరోస్టా తన పీహెచ్డీ గ్రంథాన్ని గిడుగుకు అంకితమిచ్చారంటే ఆయన సవర భాషాభివృద్ధికి చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. గిడుగు పరిశోధనలను మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933లో ‘కైజర్ ఈ – హింద్’ బిరుదుతో పాటు బంగారు పతకాన్ని ఇచ్చి సత్కరించింది. ఆదిమ భాషల పరిరక్షణ చర్యల్లో భాగంగా యునెస్కో 2019ని ఆదివాసీ భాషా సంవత్సరంగా, జూలై 21ని ప్రపంచ ఆదివాసీ భాషా దినోత్సవంగా గుర్తించింది. మాతృ భాషల్ని, అంతరిస్తున్న ఆదిమ భాషలను పరిరక్షించాల్సిన బాధ్యత మన పరిపాలకులపై ఉన్నది.
– గుమ్మడి లక్ష్మీ నారాయణ