– సర్పంచ్ భర్త, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పై దాడి చేశారంటూ ఫిర్యాదు
– కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారంటూ ఆరోపణలు
– అధికార పార్టీకి పోలీసులు అంటకాగడంపై తీవ్ర విమర్శలు
బీబీనగర్, జూన్ 01 : బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ కొలను వాణి, బీఆర్ఎస్ నాయకుల కథనం ప్రకారం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్తో రిబ్బన్ కటింగ్ నిర్వహించాలని గ్రామ కార్యదర్శి సూచించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి సర్పంచ్ చేతిలో ఉన్న కత్తెరను తీసుకుని స్వయంగా రిబ్బన్ కట్ చేశారని ఆరోపించారు. దీనిని సర్పంచ్, వార్డు సభ్యులు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీయగా, సర్పంచ్ భర్త కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురకంటి సుధాకర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. అనంతరం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ కూడా పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని, సీఐ, ఎస్ఐ సమక్షంలో తమను కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారులకు సర్పంచ్ , వార్డు సభ్యులు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే అంశంపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు మార్గమధ్యలో అడ్డగించి పోలీస్ స్టేషన్కు తరలించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అనంతరం స్టేషన్లో తమతో దురుసుగా ప్రవర్తించి, భౌతికంగా దాడి చేయడం అన్యాయమని పేర్కొన్నారు. పోటోకాల్ ను ఉల్లంఘించడం మాత్రమే కాకుండా, బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరిగినప్పటికీ అధికార పార్టీ నాయకులకు పోలీసులు వత్తాసు పలికారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోకుండా వారికి మద్దతుగా వ్యవహరించడం సమంజసం కాదని విమర్శించారు. స్దానిక పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలిపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.