కారేపల్లి, జూన్ 01 : గత సంవత్సరం వానాకాలంలో 14 ప్రాంతాల్లో రోడ్లు, లో లెవెల్ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలపై వరద నీళ్లు ప్రవహించడం గుర్తించడం జరిగిందని కారేపల్లి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వివిధ శాఖల ప్రభుత్వాధికారులతో సోమవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఆయా ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని, రానున్న వర్షాకాలం సీజన్లో చెరువులు, లో లెవెల్ బ్రిడ్జిలు, వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేసి జాగ్రత్తలు పాటించాలన్నారు. పశువులను వర్షంలో మేపడానికి వెళ్లకుండా చూడాలని, చేపలు పట్టడానికి ప్రజలు వాగులు, కుంటలు, చెరువులలోకి వెళ్లకుండా గ్రామస్థాయి బాధ్యత తీసుకోవాలన్నారు.
అదేవిధంగా పాడుబడ్డ ఇండ్లను గుర్తించి వర్షాకాలంలో ఆవాసాలలో ఉండకుండా ఆ ఇంటి యజమానికి అవగాహన కల్పించి పునరావాసా కేంద్రాలకు తీసుకురావాలన్నారు. వర్షాకాలంలో కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్, 11విద్యుత్ లైన్ల దగ్గర ఉండకూడదన్నారు. వర్షాకాలంలో నీటి ట్యాంకులను శుభ్రపరిచి ప్రతి ట్యాంక్లో క్లోరినేషన్ చేయాలని, శానిటేషన్ కు బ్లీచింగ్, సున్నం ప్రతి గ్రామ పంచాయితీలో స్టాక్ ఉండాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.