ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి నిర్వహించ తలపెట్టిన మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (Womens Champions Trophy) తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్లో టోర్నమెంట్ జరగాలి. కానీ, ఈ మెగా ఈవెంట్ను అంతకంటే ముందుగానే ఆడించాలని ఐసీసీ తీర్మానించింది. 2027 ఫిబ్రవరిలో 10 జట్లతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని నిర్ణయించింది. ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్ అనంతరం అహ్మదాబాద్లో జరిగిన త్రైమాసిక సమావేశంలో ఐసీసీ పెద్దలు షెడ్యూల్ మార్పునకు ఆమోదం తెలిపారు.
వరల్డ్కప్ వంటి ఐసీసీ ఈవెంట్లలో సమాన నగదు బహుమతితో మహిళా క్రికెట్ అభివృద్ధికి బాటలు వేసిన ఐసీసీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీతో అతివల ఆటను మరో మెట్టు ఎక్కించాలనుకుంటోంది. అందులో భాగంగానే వచ్చే ఏడాది(2027) జూన్ – జూలైలో టోర్నీ జరపాలని ఐసీసీ భావించింది. కానీ, ఫిబ్రవరిలో ఈ మెగా టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది.
Big decisions after the ICC Board meeting in Ahmedabad.
Details ⬇️https://t.co/JvTRR94Dsz
— ICC (@ICC) June 1, 2026
అహ్మదాబాద్లో ఆదివారం అధ్యక్షుడు జై షా(Jai Shah) నేతృత్వంలో సమావేశమైన ఐసీసీ సభ్యులు షెడ్యూల్ మార్చాలని, ఫిబ్రవరిలో 10 జట్లతో టోర్నీ జరపాలని తీర్మానించారు. దాంతో.. 2027 ఫిబ్రవరిలో ఐదు పూర్తిస్థాయి సభ్య దేశాలు, ఐదు అసోసియేటెడ్ దేశాలు.. మొత్తం 10 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సీజన్లో తలపడనున్నాయి.
తొలుత 8 జట్లతో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని జరపాలని 2022లో ఐసీసీ భావించింది. మహిళా క్రికెట్ సభ్య దేశాలు అందుకు అంగీకరించడంతో 2027 జూన్లో టోర్నీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే.. న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఆరు మ్యాచ్లు ఆడనుంది. అదే సమయంలో జూన్ 12 నుంచి మహిళల పొట్టి ప్రపంచకప్(Womens T20 World Cup 2026)మొదలవ్వనుంది. దాంతో, ఛాంపియన్స్ ట్రోఫీని ఫిబ్రవరిలో జరపడమే సబబు అని ఐసీసీ బృందం ఆలోచన చేసింది.