Lionel Messi : కోల్కతా (Kolkata) లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. కేవలం ఆరు నెలల క్రితమే అత్యంత వైభవంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం.. బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం నుంచే కోల్కతాలోని లేక్ టౌన్ ప్రాంతంలో హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో విగ్రహాన్ని తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. గత వారం (మే 25న) బలమైన గాలులు వీచినప్పుడు, భూగర్భ పాదచారుల క్రాసింగ్పై ఏర్పాటు చేసిన ఈ భారీ ఫైబర్గ్లాస్ (Fiber Glass) విగ్రహం తీవ్రంగా కదలడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
వారి ఫిర్యాదులతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఇంజనీర్లు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. విగ్రహం పునాది సరిగ్గా మధ్య భాగంలో లేదని, ఫిట్టింగులు వదులుగా ఉన్నాయని, నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతో అధికారులు తక్షణమే స్పందించి విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించారు. అర్జెంటీనా 2022లో ఫుట్బాల్ ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా మెస్సీకి నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
2025 డిసెంబర్లో మెస్సీ తన ‘గోట్ టూర్’లో భాగంగా భారత్లో పర్యటించినప్పుడు స్వయంగా అతడే వర్చువల్గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. కోల్కతాలో మెస్సీకి ఉన్న అపారమైన అభిమానానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని అందరూ భావించారు. అయితే నాసిరకం నిర్మాణం కారణంగా ఆవిష్కరించిన ఆరు నెలలకే ఈ విగ్రహం తొలగింపునకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక గొప్ప క్రీడాకారుడికి ఇచ్చిన గౌరవం ఇలా అర్ధాంతరంగా ముగియడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.