తెలంగాణ సామాజిక, రాజకీయార్థిక చలనాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 1919వ సంవత్సరంలో ఏర్పాటైన తెలుగు శాఖ బోధన, పరిశోధన రంగాల్లో ప్రమాణాలను నెలకొల్పుతూ వందేండ్లను పూర్తి చేసుకుంది. సాధికారికమైన పరిశోధన విలువలను తెలుగు సమాజానికి అందించిన తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా 2024 ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో ‘తెలుగు సాహిత్య మహాసభ 2024’ జరుగనున్నది. ఓయూ తెలుగు శాఖాధ్యక్షులు ప్రొఫెసర్ సి.కాశీం ఈ సభకు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా తెలుగు భాష, సాహిత్య, పరిశోధన రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖ కవులు, రచయితలు, పరిశోధకులు పాల్గొంటారు. అలాగే వివిధ భాష, సాహిత్య విషయాల్లో నిష్ణాతులైన 100 మంది విషయ నిపుణులు పత్ర సమర్పణ చేస్తారు. సాహిత్య శిల్పం, సాహిత్య మూల్యాంకనం అనే అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు ఉంటాయి. సాహిత్యాన్ని సాధారణ ప్రజలు, విద్యార్థుల వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 15, 16 తేదీల్లో సాహిత్య, కళాభిమానుల కోసం ‘కవితా పొద్దు, కవితా వసంతం’ అనే కవిగాయక సభలను నిర్వహిస్తున్నారు. కళాభిమానులు పాల్గొని కవిగాయక సభలను విజయవంతం చేయాల్సిందిగా కన్వీనర్ ప్రొఫెసర్ సి.కాశీం కోరారు.