సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు తమ ఇంటి పేరుతో ‘ఒద్దిరాజు సోదరులు’గా ప్రసిద్ధి చెందారు. వీరు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి దేశ్ముఖ్లు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, ఉర్దూ, పారశీ మొదలైన భాషలను నేర్చుకున్నారు. న్యాయ, జ్యోతిష, వైద్య, సంగీతాది శాస్ర్తాల్లో పండితులు. వీరు సంప్రదాయ సాహిత్యం ప్రకారం ప్రాచీన పద్ధతిలో కావ్యాలను రచించినా, ఆధునికత వైపు దృష్టి సారించారు.
ప్రాచీనత నుంచి ఆధునికత వైపు తెలంగాణ మలుపు తిరిగే ధోరణికి ఈ సోదరులు నిదర్శనం. 1922లో ‘తెనుగు’ అనే వారపత్రికను నడిపారు. వారే సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ పత్రికను పంచేవారు. ఒక అచ్చుయంత్రం తీసుకొచ్చి ‘విజ్ఞాన ప్రచారిక గ్రంథమాల’ పేరుతో గ్రంథాలు ప్రచురించారు. సీతారామచంద్రరావు (1887-1956) ‘రుద్రమదేవి’ అనే చారిత్రక నవలను రాసి మద్రాసు వారి ‘విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి’ నవల పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది 1918లో ముద్రింపబడింది. 1922 లో పునర్ముద్రింపబడింది. ఈయన ‘శౌర్యశక్తి’, ‘భ్రమరం’, ‘బ్రాహ్మణ సాహసం’ అనే చారిత్రక నవలల ను, ‘స్త్రీ సాహసం’, ‘ముక్తలవ’ అనే సాంఘిక నవలలు, నాటకాలు, ఖండకావ్యాలు, పద్యకావ్యం రచించాడు.
రాఘవ రంగారావు (1894-1973) ‘వీరావేశము’, ‘వరాహముద్ర’ అనే చారిత్రక నవలలు రాశాడు. ‘ఠాగూరు నౌకాభంగము’ను తెనుగించాడు. ఈ సోదరులు కథానికలను కూడా రచించారు. అవి ‘సుజాత’ అనే పత్రికలో అచ్చయ్యాయి. ఒద్దిరాజు సోదరుల భవనాన్ని రజాకార్లు కాల్చివేయటంతో వారి రచనలెన్నో దొరకకుండా పోయాయి. సీతారామచంద్రారావు ‘రుద్రమదేవి’ నవలను అనుసరించే కావచ్చు.. వరంగల్లులో కొన్నాళ్లు నివసించిన ఒద్దిరాజులతో పరిచయమున్న నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’, ‘తిక్కన సోమయాజి’ చారిత్రక నవలలను రచించాడు.
సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక చరిత్ర పరిశోధన గ్రంథాలు, కథలు, కవిత్వం, నాటకాలు రచించాడు. పత్రికా సంపాదకత్వం నిర్వహిస్తూ 21 ఏండ్లు ఆ పత్రిక సంపాదకీయాలు రాశాడు. ‘గోలకొండ పత్రిక’లో ఆనాటి రాజకీయ, సామాజిక వార్తలను ప్రచురిస్తూ ప్రజల్లో పోరాట చైతన్యాన్ని నింపాడు. ఈ పత్రికలో ఎన్నో సామాజిక వ్యాసాలు, సాహిత్య, రాజకీయ వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. రచయితలను ప్రోత్సహిస్తూ వారిచే రచనలు చేయించాడు. 1932లో ముడుంబై వెంకట రాఘవాచార్యులు ‘ఆధునిక భావ కవిత్వం’ పేరుతో వ్యాసం రాసి గోలకొండ పత్రికకు పంపాడు. తెలంగాణలో తెలుగు కవులే లేరు అని ఆ వ్యాసంలో రాశాడు. అది చూసిన సురవరం రెండేండ్లు శ్రమించి 354 మంది తెలంగాణ కవుల కవితలతో 1934లో ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రచురించాడు. ముడుంబై మాటలను సురవరం తెలంగాణ ఆత్మగౌరవానికి సవాలుగా తీసుకొని ఆ సంచికను కవుల ఫొటోలతోసహా ప్రచురించాడు. ఈ సంచికలో భావకవిత్వం ప్రక్రియకు చెందిన కవితలెన్నో ఉన్నాయి. ‘తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం కాదని, పూజనీయులు’ అని సురవరం ప్రకటించాడు. ఆయన ఎన్నో కావ్యాలను పరిశోధించి రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు తెలుగు రచనల్లో తొలిసారిగా 1952లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
నిజాం రాజ్యంలో ఎటువంటి రాజకీయ సాంస్కృతిక చైతన్యం లేని కాలంలో సురవరం ‘గోలకొండ పత్రిక’ను నడిపాడు. ప్రజలు తమ మాతృభాషలో చదువుకొనేలా ప్రోత్సహించాడు. రాజకీయ, సాంస్కృతిక చైతన్యం తెచ్చాడు. 1943లో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ను సురవరం స్థాపించాడు. ‘ఆంధ్ర మహాసభ’లు 1937 నుంచి రాజకీయ వ్యవహారాల్లో మునిగిపోవటంతో సాహిత్య విషయాలను పట్టించుకోలేదు. అప్పుడు సురవరం సాహిత్య సభలను నిర్వహించి భాషాసాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు.
పరిషత్తు పరీక్షలను నిర్వహించి డిగ్రీలను ఇచ్చి ప్రజలు తెలుగు భాషా, సాహిత్యాలను మెరుగుపరుచుకోవటానికి అవకాశం కల్పించాడు. సురవరం మంచి వక్త. ఆయన ప్రసంగాలు సభికుల మెప్పు పొందేవి. ఆయన మంచి వ్యాస రచయిత కూడా. గ్రంథాలయోద్యమం, పత్రికల ఉద్యమం, సాహిత్యోద్యమాలేగాక సురవరం స్త్రీ సంస్కరణోద్యమం, హరిజనోద్యమంలో కూడా పాల్గొన్నాడు. హరిజనోద్యమం నడిపేవాళ్లు మాలమాదిగ భేదాన్ని చూప డాన్ని ఆయన అప్పట్లోనే ఖండించాడు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన వైతాళికుడు సురవరం.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606