ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎం రామశర్మ. ఆయన పద్యాల్లో తెలుగు భాష పరిమళిస్తుంది.
అష్టావధానంలో ఎనిమిది మంది పృచ్ఛకులు ఉంటారు. అవధానికి ఒక్కో పృచ్ఛకుడు ఒక్కో ప్రశ్న సంధిస్తాడు. ఛందస్సు, వ్యాకరణ నియమాలు పాటిస్తూ, అవధాని వాటికి పద్య రూపంలో సమాధానాలు చెబుతారు. ఒక్కో ఆవృత్తిలో ఒక్కో పాదం పూరిస్తారు. చివరగా నాలుగు పాదాలు ధారణ చేసి అప్పజెబుతారు. నిషిద్ధాక్షరి, దత్తపది, సమస్య, వర్ణన, న్యస్తాక్షరి, అంత్యాక్షరి, ఆశువు, అప్రస్తుత ప్రసంగం ఇలా ఎనిమిది విభాగాల్లో పృచ్ఛకులు వేసిన ప్రశ్నలకు అవధాని సమాధానం ఇస్తారు.
Tన్యూస్ చానల్లో నేడు మధ్యాహ్నం 1 నుంచి ప్రసారం కానున్న జీఎం రామశర్మ అష్టావధానం షడ్రుచుల ఉగాది పచ్చడికి తెలుగు పద్యంరుచిని అదనంగా జోడించనుంది.
విషయం: తెలంగాణ ప్రగతి దిశగా ఉత్తమ పాలన
1.కం॥ శ్రీలందింప న్గాదా
హేలేందుడె దిగె వరకృషి నిలపై నింపై
పాలకుడై తెలగాణ
శ్రీ లాస్యములాడ చంద్రశేఖర పరతన్
భావం: తెలంగాణకు చల్లని సిరులను పంచడానికి దివినున్న ఆ చంద్రుడే మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రూపం లో ఈ నేలకు పాలకుడై దిగాడు.
పాదం: అభినవ కృష్ణరాయలుగ నందరి మన్ననలంద సాధ్యమే
2.చ॥ ప్రభలను బంచగా జగతి ప్రాంచిత రీతి తెలుంగు సాహితీ
సభలను జేసెనే ప్రభుత సారథి, తా తెలగాణ రత్నమై
శుభహితము ల్వెలుంగగ యశోగతి రాజగు చంద్రశేఖరుం
డభినవ కృష్ణరాయలుగ నందరి మన్ననలంద సాధ్యమే
భావం: తెలంగాణ ప్రభలను ప్రపంచానికి పంచడానికి, మహోజ్జలంగా తెలుగు మహాసభలను నిర్వహించిన తెలంగాణ రత్నమై, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా శుభాలను, హితాలను కలిగిస్తూ ప్రఖ్యాతి వహిస్తున్న రాజైన మా చంద్రశేఖరరావు అభినవ కృష్ణరాయలుగా మన్ననలందడం సుసాధ్యమే.
పదాలు: చెలక, పలుపు, బలిమి, కలువ- ఈ పదాలతో రైతుబంధు పథకం గురించి
3.చ॥ చెలకలు పుల్కరింప మహి సేద్యములై కడు హృద్యరీతులన్
ములుకులు గల్గు నాగలులు మోహనమై పలు పూర్ణతల్ గనన్
బలిమియె లేక, పెట్టుబడి బంచుచు మంచిగ రైతుబంధుతో
కలువగ తీర్చిదిద్దె తెలగాణను రాణగ రాజచంద్రుడున్
భావం: రైతుబంధుతో తెలంగాణలో చెలకలు పులకరిస్తున్నాయి. హృద్యంగా సేద్యం సాగుతున్నది. నాగళ్లు మోహనమై సేద్యంలో పూర్ణత్వాన్ని పొందుతున్నాయి. రైతుబంధుతో పెట్టుబడి పంచుతూ మా రాజచంద్రుడైన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ సీమను కలువ పువ్వుగా వికసింపజేస్తున్నారు.
అంశం: జగద్విఖ్యాత శిల్పకళాశోభితమైన యాదాద్రి నూతన ఆలయ వైభవం
4.మ॥ అలనా శిల్పులమేయ ధీ‘మయులు’ సత్యానంద సందోహులున్
భళి! శిల్పమ్ములలోన జీవకళలై భావాలు నర్తించె, రం
గుల బంగారు కళాకలాపములు చేకూరంగ యాదాద్రినే
ఇలవైకుంఠపురమ్ముగా మలచె నెంతే కేసీఆర్ పూజ్యుడౌ
భావం: యాదాద్రి శిల్పులు అద్భుత ప్రతిభ కలిగిన మయబ్రహ్మలే. శిల్పాలలో జీవకళలు భాసిస్తున్నాయి. ఎన్నో ప్రసన్న భావాలు నర్తిస్తున్నాయి. స్వర్ణకాంతుల యాదాద్రిని ఇల వైకుంఠపురంగా మలచిన కేసీఆర్ అందరికీ గౌరవనీయుడు.
అంశం: మొదటి పాదంలో 6వ అక్షరం ‘కా’, రెండోపాదంలో 17వ అక్షరం ‘ళే’, మూడోపాదంలో 4వ అక్షరం ‘శ్వ’, నాలుగోపాదంలో 6వ అక్షరంగా ‘ర’ వచ్చేలా శార్దూల వృత్తంలో పద్యం
5.శా॥ శ్రీమంతమ్ముగ కాకతీయ మిషనే ప్రీతిన్ తటాకాలకున్
సీమంతమ్మును గూర్చి కాంతిపథమై శ్రీకార కాళేశ్వర
స్వామిన్ శాశ్వతుగొల్చి కోట్ల ఎకరాల్ సంపన్నము ల్గాగ నీ
సీమన్ కీర్తికరమ్ముగా మలచె కేసీఆర్ మహామాన్యుడున్
భావం: శ్రీమంతమైన మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ చెరువులకు సీమంతాన్ని (జలకళను) సంతరింపజేశారు మన ముఖ్యమంత్రి. అలాగే కాళేశ్వరస్వామిని నీళ్లకై సేవించి, కోట్ల ఎకరాలను సుసంపన్నం అయ్యేలా ఈ తెలంగాణ సీమను కీర్తిమూర్తిగా మలచిన కేసీఆర్ మనకు మహామాన్యుడు.
6.తేగీ॥ యుక్తమైనట్టి షీ టీమ్సు శక్తి జూప
స్థాపితమ్మయ్యె యువతుల సాకుటకయి
మహిళలకు ధైర్యమీయగా మహిని వెలిగె
మహిళ వెన్నంటు కీచకుల్మలగి తొలగ
భావం: యువతుల రక్షణ కోసం షీ టీమ్స్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మహిళలను వేధించి, బాధించే కీచకులు తొలగడానికి, మహిళలకు ధైర్యం కలగడానికి షీ టీమ్స్ తోడ్పడుతున్నాయి.
7.చ॥ శుభకృతి నామ వత్సరమ! శోభల గూర్చగ రమ్మురమ్ము, మా
కభయము నిమ్ము సుమ్ము, తెలంగాణ క్షేమము గల్గనిమ్ము, మా
ప్రభుతకు సర్వదా జయము బల్కుము చిల్కుము సర్వసంపదల్
ప్రభలు వెలుంగ నీకిదియె స్వాగతమందును పద్యసూక్తిచే
భావం: ఓ శుభకృతినామ నూతన వత్సర పర్వమా! మాకు అభయాన్ని ప్రసాదించు. మా తెలంగాణ రాష్ర్టానికి క్షేమాన్ని, మా ప్రభుత్వానికి సర్వదా జయాన్ని, సకల సంపదలను కాంతులను కలిగించుమని వేడుకుంటూ నీకిదే నా పద్య స్వాగతం.
-అవధాన అనుసంధానకర్త దత్తాత్రేయ శర్మ