2024, ఏప్రిల్ 9న చెలిమె పేజీలో డాక్టర్ శ్రీ భాష్యం అనూరాధ గారు రాసిన ‘రామాయణంలో స్త్రీ పాత్రల ఔచిత్యం’ అనే వ్యాసాన్ని చదివాను. వారు రావణాసురుని రెండో భార్య ధాన్యమాలిని గురించి కూడా పేర్కొన్నారు. ఈమె అతికాయుని తల్లి. అయితే రామాయణంలో అతి ముఖ్యమైన పాత్ర స్వయంప్రభ గురించి కొంచెం కూడా ముచ్చటించలేదు. స్వయంప్రభ లేకపోతే సీతాన్వేషణ నిమిత్తం దక్షిణ దిశగా సాగిన హనుమ బృందం వింధ్య రజత పర్వతాల వద్దనే ఆగిపోయేది. ఎందుకంటే, అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు దాటిపోయింది. వారు దాహంతో రుక్షబిలంలో ప్రవేశించారు. ఆ సొరంగంలో నుంచి వారికి బయటపడే మార్గం కనపడలేదు. అక్కడ మేరు సావర్ణి పుత్రిక స్వయంప్రభ తపస్సు చేసుకుంటున్నది. మహా తేజస్సుతో వెలిగిపోతున్నది. ఆమె హనుమ బృందం కథ విని వారికి ఆతిథ్యం ఇచ్చింది. అనంతరం స్వయంప్రభ తన తపోశక్తితో హనుమ బృందాన్ని దక్షిణ దిశలోని సాగరానికి చేర్చింది.
మనం ప్రస్తుతం 7వ మనువు వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. వైవస్వతో మనుర్నామ… అంటూ రఘువంశ మూల పురుషుని గురించి మహాకవి కాళిదాసు రఘువంశంలో చెప్తారు.
ఇక్కడ స్వయంప్రభ లేకపోతే హనుమ బృందం దక్షిణ దిశలోని సాగరానికి రావడానికి చాలా కాలం పట్టేది. సుగ్రీవుడు తాను పెట్టిన గడువు ముగియడంతో తను హనుమ బృందం గురించి రకరకాల ఆలోచనలు చేయవలసిన దుస్థితి దాపురించేది. దీన్ని బట్టి రామాయణంలో అతి ముఖ్యమైన, అతి చిన్న పాత్ర స్వయంప్రభదేనని తెలుస్తున్నది. స్వయంప్రభ తండ్రి మేరుసావర్ణి 11వ మనువు. పురాణాల ప్రకారం.. మనువులు మొత్తం 14 మంది. మనం ప్రస్తుతం 7వ మనువు వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. వైవస్వతో మనుర్నామ… అంటూ రఘువంశ మూల పురుషుని గురించి మహాకవి కాళిదాసు రఘువంశంలో చెప్తారు. వైవస్వత మను వంశానికి చెందిన శ్రీరామచంద్రుని భార్య సీతాన్వేషణకు మేరుసావర్ణి మను పుత్రిక స్వయంప్రభ సహకరిస్తుంది.
వైవస్వత మనువు 7వ మనువు అయితే మేరుసావర్ణి మనువు 11వ మనువు. 11వ మనువు పుత్రిక స్వయంప్రభ ఋక్షబిలంలో తపస్సు చేసుకోవడమేమిటి? అంటే ఇక్కడ అనేక విజ్ఞానాత్మక విషయాలు గోచరిస్తాయి. హనుమ బృందం ఋక్ష బిలంలోకి ప్రవేశించడమంటే వారు భవిష్యత్తులోకి వెళ్లిపోయారని అర్థం. అందుకే వారికి వర్తమాన మార్గం కనపడలేదు.
భవిష్యత్తులో ఉన్న స్వయంప్రభే వారిని వర్తమానంలోకి పంపింది. మూల రామాయణంలోని సంస్కృత శ్లోకాలు చదివితే ఇక్కడ అనేక మహోన్నత విజ్ఞానాత్మక విషయాలు ఛాయామాత్రంగా గోచరిస్తాయి. భవిష్యత్తు విజ్ఞాన చంద్రికలు స్వయంప్రభ లాంటి మహిళామూర్తులు అని తెలుస్తుంది. స్వయంప్రభ అన్న పేరే తనకు తానుగా కష్టించి నిర్మించుకున్న విజ్ఞాన వెలుగు అన్న అర్థాన్ని తెలియజేస్తుంది. ఆమె గగనవాయు గణశాస్ర్తాలలో మహా నైపుణ్యం కలది.
మన వేద మంత్రాల్లో వైవస్వత మన్వంతరే… అని వస్తుంది. అంటే మనం 7వ మనువు కాలంలో ఉన్నామని అర్థం. 14 మనువులలో 7వ మనువు అంటే సగం మనువుల కాలం పూర్తయ్యిందని అర్థం. నేటి ఆధునికత భౌతిక శాస్ర్తాదులు కూడా దాదాపు భూమికి సగం వయస్సు నిండిందనే చెప్తున్నాయి. మన మహర్షులు ఇలాంటి విజ్ఞానాత్మక విషయాలను స్వయంప్రభ వంటి పాత్రల ద్వారా నిక్షిప్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ మన పురాణ పండితులు అధికశాతం ఇలాంటి విషయాలు చెప్పకుండా సీత, అనసూయ అంటూ కథలు మాత్రం చెప్తున్నారు. మన పురాణాలను సూక్ష్మంగా పరిశీలిస్తే అనసూయ ఆశువ్రీహి అనే వరి ధాన్యాన్ని కనిపెట్టినట్టు తెలుస్తుంది. ఇలాంటి విషయాల మీద పరిశోధన చేయకుండా ‘మన వేద పురాణాల్లో అన్నీ ఉన్నాయి! విదేశీయులు వాటిని ఎత్తుకెళ్లిపోయారు! వాటినే మనకు చెప్తున్నారు’ అని ఇప్పుడు కూడా అంటే అంతకుమించిన తెలివితక్కువతనం మరొకటి లేదు. ఒకప్పుడు ఈ మాట అంటే చెల్లింది. ఇప్పుడు కూడా అదే మాట అంటే…
భారతీయ పురాణ పండితులు మాటలకు తప్ప ప్రయోగశాల ముఖం చూడటానికి పనికిరారు, వారి చూపులు, మాటలు ఆకాశానికి ఉంటే చేతలు పాతాళానికి ఉంటాయని అందరూ అంటారు.
శాంత దశరథుని కూతురా? రోమపాదుని కూతురా? ఇంతకీ రామునికి సీత ఏమవుతుంది? సీతకు రాముడు ఏమవుతాడు? ఇద్దరూ మనకేమవుతారు? రాముని అయనం రామాయణమా? సీతాయాః చరితం సీతాయణమా? రావణ వధా? లంకా విజయమా? వంటి ఆలోచనలతో కాలక్షేపం చేసినంతకాలం రామాయణంలోని స్వయంప్రభ లాంటి వారి విజ్ఞానతేజం బహిర్గతం కాదు.
వాగుమూడి
లక్ష్మీ రాఘవరావు
98494 48947