నిజాం పాలనాకాలంలో ప్రారంభమైన ఆనాటి ‘నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తు ఈ నాటి ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’ కు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. నాటి నుంచి నేటి వరకు నిరంతరంగా తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి ఘనమైన సేవలను అవిచ్ఛిన్నంగా అందిస్తూనే ఉన్నది. ఈ పరిషత్తు స్థాపన ఉద్దేశాన్ని చారిత్రక నేపథ్యంలో పరిశీలిస్తే అనేక మధురస్మృతులు గుర్తుకు వస్తాయి.
1930లో ‘ఆంధ్ర జనసంఘం’ ఏర్పడింది. తదనంతర కాలంలో అది శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ తర్వాత అది ‘ఆంధ్రమహాసభ’ గా ప్రకటించుకున్నది. దాని ప్రధానలక్ష్యం రాజకీయ అంశాలకు, హ క్కుల సాధన కోసం పోరాటం సాగించటానికే పరిమితమైంది. అందువల్ల తెలుగు భాషా,సాహిత్య వికాసానికి ఆటంకం కలుగుతుందని భావించి, మరో ప్రత్యేక సంస్థ ఉండాలని సభ్యులు భావించారు. ఫలితంగా 1942 మే నెలలో ధర్మవరంలో జరిగిన 9వ మహాసభలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అనుసరించి 1943 మే 26న ‘ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించారు. ఆంధ్ర మహాసభ ప్రాంగణంలోనే మొదటి సమావేశం జరిగింది. దీనికి ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’ అనే పేరు పెట్టారు. దీని ప్రధాన ఆశయం తెలుగు భాషా సంస్కృతుల్ని సుదీ ప్తం చేయటం. ఆ తర్వాత 1947నుంచి నిజాం రాష్ట్రం అనే పదాన్ని తొలగించి ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే పేరుతో కొనసాగుతుంది.
పరిషత్ 1944లో అక్షరాస్యత, వయోజన విద్య కార్యక్రమాలు నిర్వహించింది. అనేక పాఠశాలలు నెలకొల్పి విద్యా వ్యాప్తికి కృషి చేసింది. 1945లో నల్గొండలో పరిషత్తు సభలు జరిగాయి. పరిషత్తు సభ్యులు ప్రతినెల సాహి త్య సమావేశాల పేరుతో పౌరహక్కులను ప్రచారం చేసి స్టేట్ కాంగ్రెసు కార్యకలాపాలకు ఊతం ఇచ్చేవారు. ‘నీలగిరి సారస్వత సంఘం’ అనే సంస్థను స్థాపించి యువరచయితల రచనలను ‘తొలిసంధ్య’ అనే పేరుతో ఒక సంకలనాన్ని ప్రచురించారు. ఈ సంస్థ రాజకీయాలకు అతీతంగా తెలుగు సారస్వత అభివృద్ధి కోసం కృషిచేసింది. సంస్థ ప్రధాన కార్యదర్శి బిరుదు శేషయ్య నేతృత్వంలో తెలుగులో ప్రథమ, మధ్యమ, పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు పాఠ్యపుస్తకాలను కూడా నిర్ణయించారు. ఈ పరీక్షలు అనేకమందిని ఆకర్షించాయి.
సారస్వత పరిషత్తు ప్రాచీన సాహిత్య గ్రంథాలను సేకరించి ప్రచురించింది. మాండలిక పదకోశాలను తయారు చేసిం ది. తెలుగు రచయితలను వెన్నుతట్టి ప్రోత్సహించి అనేక అద్భుత గ్రంథాలను ప్రచురించి తెలుగు భాషాభిమానుల పఠన దాహర్తిని తీర్చింది. మొదట సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకానికి తెలుగు భాషలో తొలిసారిగా కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. మహాభారతం, భాగవతం, ఆంధ్ర భాష, సాహిత్యం, సంస్కృతి పై అనేక ఉపన్యాసాలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిచే ఇప్పించింది. ఈ ఉపన్యాసాలకు ‘పరిణిత వాణి’ అనే పేరు పెట్టింది. దేవులపల్లి రామానుజరావు, గడియా రం రామకృష్ణశర్మ, బూర్గుల రంగనాథం సంస్థ కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర నిర్వహించి సారస్వత పరిషత్ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.
సారస్వత పరిషత్తుకు దేవులపల్లి రామానుజా చార్యులు 50 ఏండ్లపాటు అధ్యక్షులుగా విశేష సేవలు అందించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. దీంతో 2015 లో ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు.
దేవులపల్లి తర్వాత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సీ నారాయణరెడ్డి 1993 నుంచి అంతిమశ్వాస వరకు 25 ఏండ్ల పాటు అధ్యక్షులుగా ఉండి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షులుగా, డాక్టర్ జుర్రు చెన్నయ్య ప్రధాన కార్యదర్శిగా పరిణితవాణి ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. ఉత్తమ గ్రంథాల ప్రచురణ,ఉత్తమ గ్రంథాలకు బహుమతులు, వివిధ రంగాలలో యువతకు సృజనాత్మక రచనపై అధ్యయన శిబిరాలు, సదస్సులు, కళలు, ఉత్సవాలు మొదలైన వి నూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తెలంగాణ 33 జిల్లాల చరిత్ర- సంస్కృతి, సాహిత్యం కళలు మొదలైన అంశాలతో సమగ్ర గ్రంథాలను వెలువరిస్తూ తనదైన శైలిలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని నలుదిశలా చాటుతూ ఘనమైన సేవలు నేటికీ అందిస్తూనే ఉన్నది.
డా కోలాహలం ,రామ్ కిశోర్
98493 28496