తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.
1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. వ్యావహారిక భాషా వాదాన్ని ప్రారంభించిన గిడుగు గ్రాంథిక భాషా ద్వేషి మాత్రం కాదు. వాడుక భాషావాదాన్ని చేపట్టినందుకు గిడుగు వారు పండితులతో యుద్ధం చేయవలసి వచ్చి ంది. దీన్ని గ్రామ్య వాదమని, గిడుగు వారిని గ్రామ్యా చార్యులని హేళన చేస్తూ పద్యాలు, వ్యాసాలు రాశారు. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు పత్రిక ద్వారా గ్రాంథిక వాదాన్ని ఖండిస్తూ వ్యావహారిక వాదాన్ని బలపరిచారు. పండితులే తప్పులు లేకుండా రాయలేని గ్రాంథికం బలవంతాన రుద్ద డం ఎందుకంటూ ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం’ పుస్తకం ప్రచురించారు.
భాషలోని పదజాలానికి ప్రకృతి ప్రత్య యం చేసి శోధించి భాష తత్వాన్ని సాధించారు గిడుగు.రెండు నిఘంటువులు రచించారు. తెలుగువారికి తుది విన్నపం చేస్తూ భాషాభిమానాన్ని ప్రబోధించారు. గిడుగు వ్యావహారిక భాషా ఉద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకున్నది. విశ్వవిద్యాలయాల్లో వాడుక భాషగా రాజ్యమేలుతున్నది. తెలుగు అధికార భాషగా, పరిపాలన భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికి గిడుగే మూలకారకుడు.
(ఆగస్టు 29 గిడుగు వెంకట రామమూర్తి జయంతి)
– యాడవరం చంద్రకాంత్ గౌడ్, 9441762105