జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద సంస్కృతిలో భాగమే.జానపద సాహిత్యంలో తరచుగా ద్విపద ఛందస్సు, మరికొద్ది తాళగతుల్లో సాగుతూ వుంటాయి. వీటిలో సంగీతపు పాండిత్యం కంటే, తాళగతులకే ప్రాముఖ్యం. తాళం కోసం హ్రస్వాక్షరాలు పొడుగు చేయటం, దీర్ఘాక్షరాలను పొట్టి చేయటం ఉంటుంది. మరొక విశేషం ఏమంటే.. ఈ పాటలు పుట్టిన సామాజిక వర్గాన్ని బట్టి భాషలో, భావంలో తేడాలుంటాయి. పంట పొలాలు, పండుగలు, పూజలు, పేరంటాలు, పెళ్ళిళ్ళు, చావులు, పుట్టుకలు వంటి అనేక నిత్య కృత్యాలన్నీ జానపద గేయాలకు మూలాలు.
జానపద వాఙ్మయం జానపద విఙ్ఞానంలో ఒక భాగం. ‘ఫోక్లోర్’ అనే పదానికి ‘జానపద విఙ్ఞానం’ సమానార్థక పదం. ‘ఫోక్ లిటరేచర్’ అనే పదానికి తెలుగులో ‘జానపద సాహిత్యం’, ‘జానపద వాఙ్మయం’ అనే పదాలను సమానార్థాలుగా వాడుతున్నారు. జానపద గేయాల విషయంలో పాల్కుర్కి సోమనాథుడు రచించిన ‘బసవ పురాణం’ మనం ప్రామాణికంగా భావి స్తాం. 12,13 శతాబ్దులకు సంబంధించిన ఇతర కవులు, అలంకారికులు, లలితకళా విద్వాంసు లు కూడా జానపద గేయాల అస్తిత్వాన్ని ప్రస్తా వించటం గమనార్హం.
జానపద గేయాలు జనజీవన స్రవంతిలో లీనమై జాతి జీవికకు జీవనాడి వంటివి. జానపద గేయం వివిధ శాఖోపశాఖలుగా వ్యాపించింది. వీటిని పండితులు వివిధ దృక్కోణాల్లో వర్గీకరణ చేశారు. వీరిలో ఆచార్య బి.రామరాజు, హరి ఆదిశేషువు, ఆచార్య నాయని కృష్ణకుమారి, నేదునూరి గంగాధరం ముఖ్యులు.
జానపద గేయ వర్గీకరణ వస్తు, రస, సన్నివేశం మొదలగు అంశాలను దృష్టిలో పెట్టుకుని వర్గీకరించటం జరుగుతున్నది. ఈ వర్గీకరణ ప్రకారం మొత్తం జానపద గేయాలను 1. కథాసహితములు, కథా రహితములు. 2. స్త్రీల పాటలు, పురుషుల పాటలు, స్త్రీ, పురుషులు కలసి పాడుకునేవి, పిల్లల పాటలు. 3. రసప్రధాన వర్గీకరణ. 4. శ్రామిక గేయాలుగా విభజించారు.
కథాసహితములు: ప్రపంచ కథావాఙ్మయంలో తెలుగు గేయగాథ శాఖకు పటిష్టమైన స్థానమున్నది. జీవితంలోని వివిధ దశలకు సంబంధించిన పనులకు లేక కార్యక్రమాలకు సంబంధించి వుంటాయి. బాలనాగమ్మ కథ, సన్యాసమ్మ కథ, పల్నాటి వీర చరిత్ర, కాటమరాజుకథ మున్నగునవి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ వర్గీకరణలో సంఘజీవనం ప్రస్ఫుటంగా కానవస్తుంది.
కథారహితములు: వీటిలో ఏదో ఒక సన్నివేశమో, కల్పనో, చిన్న ఘట్టమో తీసుకున్న చిన్న గేయాలుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు- గుమ్మడిపాట, శ్రీకృష్ణజననము, గంగా గౌరి సంవాదము, గోంగూర పాట, కోలాటం పాట మున్నగునవి. వీటిలో పాట పూర్తయ్యే వరకు తీసుకొన్న ఊత పదాలు కానవస్తాయి. ఉదాహరణకు- ఎల్లోయల్ల, హైలెస్సా వంటి పదాలు గేయం పూర్తయ్యేవరకు కనిపిస్తాయి.
స్త్రీల పాటలు: స్త్రీ తన జీవితానికి సంబంధించిన వివిధ దశల్లోని అవస్థలను పాటలుగా పాడుకొంటారు. అత్తా కోడళ్ళ వెక్కిరింతలు ఈ విధంగా ఉంటాయి. ఉదా-
‘కోడలా కోడలా కొడుకు పెళ్ళామా.. ఓయమ్మా/ కొడుకూళ్ళోలేడు మల్లెలెక్కడివే ఆ..వూ’; ‘సూదులంటి సన్నాబియ్యం సిమడ బెడితివె కోడలా/ నువ్వు సిమడాబెడితివే కోడలా!; వారుపుకొస్తే వంచవద్దని నీకెవ్వరు చెప్పారత్తమ్మో/ నీకెవ్వరు చెప్పారత్తమ్మో!’అంటూ ఈ పాటలు సాగుతాయి.
పురుషుల పాటలు: పురుషులకు సంబంధించిన వివిధ వృత్తులను అంశాలుగా తీసుకుని రచిస్తారు. శ్రామిక గేయాలు, కార్మిక గేయాలు, క్రీడా గేయాలు, వ్యవసాయ గేయాలు, వివిధ చేతి వృత్తుల పాటలు ఈ కోవలోకి వస్తాయి. అలాగే… మోటపాటలు, ఏతాం పాటలు, బండిపాటలు, మంచె పాటలు, కోలాటం పాటలు, భజన పాటలు మొదలైనవి ఈ రంగానికి చెందుతాయి. లాలిపాటలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
‘గొల్లవారి వాడలకు కిష్ణమూర్తి
నీవు ఏపని కొచ్చావు కిష్ణమూర్తి…
పాలకోసమొచ్చినానె గొల్లభామ
మంచి పాలుపోసి నన్నుబంపు గొల్లభామ…
కొత్త కోడలినోయి కిష్ణమూర్తి
నీవు అత్తగారి నడగవోయి కిష్ణమూర్తి…’అంటూ చమత్కారంగా పాడుకొంటారు. ‘అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి’, అంటూ చిడతలతో వేసే కోలాటం వేసేవాళ్ళకే కాకుండా చూసేవాళ్ళకు కూడా మంచి ఊపును కలిగిస్తాయి.
స్త్రీ, పురుషులు కలసి పాడుకునేవి: పంట కోతల సమయంలోను, వయసుకు వచ్చిన బావా మరదళ్ళు, కుర్రాళ్ళ కొంటె పాటలు మున్నగునవి ఈ సామూహిక గేయాల కోవలోకి వస్తాయి. మంచి డప్పు వాద్యంతో రక్తి కట్టిస్తారు. ‘నాయుడోళ్ళింటికాడ నల్ల తుమ్మ చెట్టుకాడ నాయుడేమన్నాడే పిల్లా’, ‘వత్తావటే పిల్లా వత్తావటే కొత్త కోరంగిదాక వత్తావటే’ మొదలైన శృంగార పాటలు ఎక్కువగా ఉంటాయి.
పిల్లల పాటలు: పిల్లల పాటలను పిల్లలే స్వయంగా పాడుకునేవి లేదా తల్లులు పిల్లలకోసం పాడేవి. పిల్ల లు మారాం చేసేటప్పుడు సముదాయించే పాటలు, లాలిపాటలు, జోలపాటలు మొదలైనవి తల్లులు పిల్లలకోసం పాడేవి.
రసప్రధాన గేయాలు: జానపద గేయాల్లో నవరసాలకు సంబంధించినవి కనిపిస్తాయి. వీరం, రౌద్రం, శృంగారం, హాస్యం ఇలా అన్ని రకాల గేయాలు గోచరిస్తాయి. శ్రీకృష్ణుని శృంగార చేష్టలను వివరించే గేయాలు ప్రధానంగా కనిపిస్తాయి. అంతే కాకుండా ప్రేయసీ ప్రియులు, భార్యా భర్తలు, వదినా మరుదులు వంటి వాటికి కూడా ప్రముఖ స్థానం వుంది. హాస్యగేయాలలో అత్తా అల్లుళ్ళ మధ్య, భార్యా భర్తల మధ్య హాస్య గేయాలు అనేకం లభిస్తాయి. రాజుల వీరత్వాని వివరించే గేయాలు వీర, రౌద్ర రసానికి సంబంధించినవి. మహాకవి భవభూతి ‘కరుణ రసమొక్కటే ప్రధాన రస’మని వ్యాఖ్యానించాడు.
శ్రామిక గేయాలు: వ్యవసాయానికి, కర్మాగారానికి, ఇతర సేవకా వృత్తికి సంబంధించిన గేయాలు శ్రామిక గేయాల కోవలోకి వస్తాయి.
జానపద వాఙ్మయం అంటేనే మౌఖికంగా వచ్చేది.. కవి, రచయిత, సంగీతకారుడు అంటూ వుండరు. అక్కడికక్కడే ఒక సన్నివేశాన్ని, సంఘటనను ప్రతిఫలింపచేసే విధంగా రాగాన్ని కూర్చుకుంటూ పాడేయగల జానపద కళాకారుడు ధన్యజీవి. అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ఆశువుగా వచ్చే భావప్రకటనే జానపద గేయం. జానపదుల అనుభూతి వారి హృదయాల నుంచి అప్రయత్నంగా అతి సహజంగా పుట్టిన ఈ పాటల్లో సహజత్వం ఉంటుంది. వీటిని పెంచి పోషించవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఎటువంటి భాషా భేషజాలకు పోకుండా జానపదుల సాహిత్యాన్ని మన నిత్య జీవనంలో భాగం చేసుకుంటే అది మన భాషా సంస్కృతులకు
ఎంతో మేలు.
– డాక్టర్ దేవులపల్లి పద్మజ,
98496 92414