వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది వడదెబ్బ బారినపడుతున్నారు. అయితే దీనిని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఎండలో తిరిగినప్పుడు మాత్రమే కాకుండా ఉకపోత, గాలి ఆడని గదులు, డీహైడ్రేషన్ వల్ల కూడా హీట్ స్ట్రోక్ రావచ్చు. సకాలంలో గుర్తించకపోతే ఇది మెదడు, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, చికిత్స వివరాలను పరిశీలిద్దాం.
హీట్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. చాలామంది వీటిని సాధారణ నీరసంగా భావించి లైట్గా తీసుకుంటారు. అలా అస్సలు చేయకూడని ఆ లక్షణాలు ఇవే.. విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు కావడం లేదా వికారంగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, మొదట్లో విపరీతంగా చెమటలు పట్టడం, ఆ తర్వాత చర్మం పొడిబారడం, కండరాల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ తీవ్రమయ్యే కొద్దీ మెదడుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల బాధితుల్లో మానసిక గందరగోళం, సృ్పహ తప్పడం, మాట ముద్దబారడం, లేనివి ఊహించుకోవడం, ఫిట్స్ వంటివి వస్తాయి.
ప్రధానంగా ఈ వడదెబ్బ ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులు, ఎండలో పని చేసే కూలీలు, రైతులు, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారితో పాటు శరీరంలో నీటి శాతం తకువగా ఉన్నవారిపై పడుతుంది. అయితే ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితులను వెంటనే ఎండలో నుంచి చల్లని గాలి వీచే ప్రదేశానికి మార్చాలి.
వాళ్ల శరీరంపై ఉండే అదనపు దుస్తులను తొలగించాలి. కాళ్లు, చేతులను తడి వస్త్రంతో తుడవాలి. మెడ, చంకలు, తల, తొడల భాగంలో ఐస్ప్యాక్లను ఉంచడం వల్ల శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గుతుంది. బాధితులు పూర్తిగా సృ్పహలో ఉంటేనే ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు లేదా మంచినీళ్లు తాగించాలి. సృ్పహ లేకపోతే ఎలాంటి ద్రవాలు నోట్లో పోయకూడదు. ఈ ప్రాథమిక వైద్యం అందిస్తూనే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.