‘మూలాలు మర్చిపోని వ్యక్తి లోకాలను ఏలుతాడు’ అని పెద్దల మాట.దీనిని అక్షర సత్యంగా నిరూపిస్తున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తన పూర్వికుల గ్రామానికి పునర్ వైభవాన్ని తీసుకొస్తున్నారు.తాతయ్య, నానమ్మ వదిలి వెళ్లిన గ్రామానికి మనవడిగా వచ్చి.. అక్కడివారితో ‘మనవాడు’ అనిపించుకున్నారు. దశాబ్దాలుగా ముంపు బాధలోమునిగిన ఊరికి.. కొత్త దారి చూపిస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఉన్న కోనాపూర్ అవసరాలను మూకుమ్మడిగా తీరుస్తూ గ్రామవాసులకు పెద్దదిక్కు అయ్యారు.
ఎనిమిదిన్నర దశాబ్దాల కిందటి ముచ్చట. ఇప్పటి కోనాపూర్ను అప్పట్లో పోసాన్పల్లిగా పిలిచేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లిదండ్రులు అదే గ్రామంలో నివసించేవారు. కేసీఆర్ తల్లి వెంకటమ్మ పుట్టినిల్లు ఇదే ఊరు. తండ్రి రాఘవరావుది ముస్తాబాద్ సమీపంలోని మోహినికుంట గ్రామం. వెంకటమ్మ కుటుంబంలో మగ పిల్లలు లేరు. దీంతో వెంకటమ్మను పెండ్లాడిన తర్వాత.. ఇచ్చిన మాట ప్రకారం రాఘవరావు పోసాన్పల్లికి ఇల్లరికం వచ్చారు. ఆనాటి నుంచి ఆ ఊరే వారి స్వగ్రామమైంది. పెద్ద ఇల్లు, గొడ్డూ గోదా, పొలాలు చూసుకుంటూ హాయిగా జీవనం సాగించారు.
1930 ప్రాంతంలో నిజాం ప్రభుత్వం మానేరు వాగు మీద అప్పర్ మానేరు డ్యామ్ కట్టాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పోసాన్పల్లి పొలిమేరలోని పొలాలన్నీ ముంపునకు గురయ్యాయి. డ్యామ్ నిర్మాణం దాదాపు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న రాఘవరావు దంపతులు 1940 ప్రాంతంలో ఊరు విడిచి పెట్టాల్సి వచ్చింది. అక్కడినుంచి ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కేసీఆర్ కూడా ఇక్కడే జన్మించారు. నిజాం సర్కారు అందించిన రూ.2.50 లక్షల పరిహారంతో చింతమడక దగ్గర వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు.
రూ.కోట్ల పనులు
తమ తల్లిదండ్రుల భూములు ఎగువ మానేరు ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. కేటీఆర్ సైతం అడపాదడపా కోనాపూర్ కబుర్లు పంచుకున్నారు. ఆ ఊరి పేరు తలుచుకొని ఊరుకోలేదు ఆయన. నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం గ్రామానికి ఏదైనా మేలు చేయాలని భావించారు. ఎనిమిది నెలల కిందట గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భావితరాల భవిష్యత్తు కోసం నానమ్మ పేరిట సొంత నిధులతో బడి నిర్మిస్తున్నారు.
కార్పొరేట్ పాఠశాల తరహాలో రూ.2.50 కోట్లతో భారీ భవన నిర్మాణం చేపట్టారు. గతేడాది మే 10న భూమి పూజ చేశారు. ఏడు నెలల్లోనే భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల అందుబాటులోకి రానుంది. మరోవైపు రూ.2.40 కోట్లతో కోనాపూర్కు వెళ్లే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. రూ.75 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు వేశారు. రూ.20 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. ఇలా, కోనాపూర్పై కేటీఆర్ చూపిస్తున్న మమకారానికి గ్రామస్తులు మురిసిపోతున్నారు. ‘ఆయన మా గ్రామానికి దేవుడిచ్చిన బిడ్డ ’ అని సంతోషంగా చెబుతున్నారు.
యాది మరవం
కేటీఆర్ పర్యటన కోనాపూర్ తలరాతను మార్చేసింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇంటింటినీ పలకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీల వ్యక్తిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కేటీఆర్.. మారుమూల పల్లెనూ అంతే ప్రభావవంతంగా తీర్చి దిద్దుతున్నారు. ‘సార్ అచ్చినప్పటి నుంచి మా ఊరు మారిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం బడి కట్టిస్తుండు. మా పిల్లలకు మంచి సౌలత్ కల్పించిన రామన్నను యాది మరువం’ అంటున్నాడు కోనాపూర్ వాస్తవ్యుడు మొగిలి నాగరాజు. ఒకరిద్దరు కాదు.. ఊరు ఊరంతా ‘రామన్న మావాడు’ అని జేజేలు పలుకుతున్నారు.
మానేరుతో అనుబంధం
కేసీఆర్ కుటుంబానికి, మానేరు వాగుకు విడదీయరాని అనుబంధం ఉంది. గోదావరి ఉపనదిగా ఉన్న మానేరు సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల మీదుగా దిగువకు ప్రయాణిస్తుంది. ఈ వాగుపై మూడు ప్రధానమైన ప్రాజెక్టులు నిర్మించారు. అవి ఎగువ మానేరు, మధ్య మానేరు, దిగువ మానేరు. ఈ మూడింట్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబీకుల గ్రామాలు మునిగిపోవడం కాకతాళీయమే! ఎగువ మానేరు డ్యాం నిర్మాణ సమయంలో కేసీఆర్ తల్లిదండ్రుల స్వగ్రామం కోనాపూర్ ముంపునకు గురైంది. మిడ్ మానేరు ప్రాజెక్టులో కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాక ముంపుపాలైంది. లక్ష్మీకాంతమ్మ, కేశవరావు దంపతుల ఇల్లు, పొలాలు ప్రాజెక్టులో మునిగిపోయాయి. కరీంనగర్ సమీపంలోని దిగువ మానేరు డ్యామ్లో లక్ష్మీకాంతమ్మ సోదరి శ్యామల, రాంచందర్ రావు దంపతుల గ్రామం వచ్చునూర్ మునిగిపోయింది. ఈ విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సభావేదికల నుంచి ప్రజలతో పంచుకున్నారు.
…? జూపల్లి రమేశ్ రావు