కరోనా దెబ్బతో రెండేండ్లు స్తబ్ధుగా ఉన్న పర్యాటకానికి 2023 మంచి ఊపునిచ్చింది. ప్రకృతి ప్రేమికులు విహారం పేరుతో కడలి అంచులకు చేరుకుంటే, సాహస వీరులు కొండకోనలను ఎంచుకున్నారు. ముఖ్యంగా భారతీయ యాత్రికులు వినూత్న పర్యాటకులమని నిరూపించుకున్నారు. ఇంటిల్లిపాదీ చర్చించి గూగుల్లో సెర్చించిన టాప్ టెన్ పర్యాటక ప్రదేశాల వివరాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. భారతీయులు ఆసక్తి కనబర్చిన ప్రదేశాల్లో వియత్నాం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి ప్లేస్ను గోవా ఆక్రమించింది. అరబిక్ కడలి అందాలతో కుర్రకారుకు కూతవేటు దూరంలో ఉన్న స్వర్గం గోవా.
స్వదేశంలో విదేశీ పర్యటన అనుభవం పొందాలనే లక్ష్యం ఉన్నవాళ్లంతా గో.. గోవా అనడంతో గూగుల్ మీటర్లో ఈ డెస్టినేషన్ రెండో ప్లేస్ను దక్కించుకుంది. ఆధ్యాత్మికత, ఆహ్లాదం అడుగడుగునా పరుచుకున్న బాలి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పట్టుతప్పిన అంతర్గత వ్యవహారాలతో కొట్టుమిట్టాడిన శ్రీలంక పర్యాటకులను అలరించడంలో ఇప్పటికీ ముందుంది.
ఈ జాబితాలో సింహళ దేశానిది నాలుగో స్థానం. దేహజాడ్యాన్ని తోకముడిపించే డెస్టినేషన్ థాయ్లాండ్. గూగుల్ జాబితాలో ఈ దేశం ఐదో ప్లేస్లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మన దేశంలోని సుందర ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయి. హిమగిరి సొగసులతో కట్టిపడేసే కశ్మీర్ ఆరు, పడమటి కనుమల్లో సుందర జలపాతాలతో అలరారే కూర్గ్ ఏడో స్థానంలో నిలిచాయి. నిండు సముద్రంలో మెండైన పచ్చదనంతో బెస్ట్ డెస్టినేషన్గా పేరున్న అండమాన్ నికోబార్ 8వ ర్యాంకు సాధించింది. యూరోపియన్ దేశాలైన ఇటలీ, స్విట్జర్లాండ్ తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి.