రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయాజాలంలో యువత బంధీ అయిపోతున్నది. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్మును కొందరు యువకులు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా పోగొట్టుకోవడంతో పాటు.. ఇంట్లో చెబితే ఏమౌతుందోననే భయంతో బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి యాప్ల ద్వారా కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతోపాటు బెట్టింగ్ మాఫియాను అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ)
సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో ఆన్లైన్ గేమింగ్కు బానిసైన 22 ఏళ్ల మణికంఠ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అక్రమ పద్ధతిలో నడుస్తున్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లలో నిర్వాహకులు ఏఐ సహకారాన్ని తీసుకుంటూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ గేమ్స్ను వివిధ సోషల్మీడియా గ్రూప్స్లో ప్రమోట్ చేస్తూ అమాయకులను ఆకర్షిస్తున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్లలో పెట్టుబడులు పెట్టి మోసపోయినవారు ఆ షాక్ నుంచి కోలుకోక, బయట మొఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్ గేమ్స్ను అరికడుతూ, నిర్వాహకులను పట్టుకోవాల్సిన పోలీసు వ్యవస్థ ఆ విషయాన్ని పట్టించుకోక పోవడంతో ఆన్లైన్ బెట్టింగ్ రాష్ట్రంలో యథేచ్చగా కొనసాగుతున్నది. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్, ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ ఆటలను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ మోసాలను అరికట్టడంలో తీవ్రంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగర శివారుతో పాటు నగరంలో ఇప్పటివరకు పలువురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో వివిధ గేమ్స్ ఆడి భారీ ఎత్తున మోసపోయారు. అందులో పలువురు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. పిల్లలను కష్టపడి చదివించి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రుల ఆశలు ఆడియాశలు అవ్వడమే కాకుండా, చేతికి అందివచ్చిన తమ పిల్లలను కోల్పోతూ ఆయా కుటుంబాలు శోకసంద్రంలోకి వెళ్తున్నాయి. తాజాగా తిరుములగిరి ఘటనలో 22 ఏండ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎల్బీనగర్లో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి ఆన్లైన్లో రమ్మీ ఆడి భారీ నష్టాలు చవిచూశాడు. ఆ నష్టాలతో బయట తిరగలేక హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోనూ ఇలాంటి పలు ఘటనలు గతంలో జరిగాయి.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కారణంగా నిత్యం ఇళ్లలో గొడవలు జరగడం, అప్పుల పాలైన తరువాత తమ తల్లిదండ్రులను మోసం చేశామని, ఎవరు చెప్పినా వినకుండా గ్యాంబ్లింగ్ ఆటకు బానిసైపోయామనే వేదనతో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ యాప్లను పూర్తిస్థాయిలో నిలువరించడంలో రేవంత్ సర్కార్, పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎంతమంది యువకులు బలిపీఠం ఎక్కాలంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇన్లూయెన్సరు ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ను ప్రమోట్ చేసి భారీగా డబ్బు సంపాదించిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఇన్లూయెన్సర్స్పై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ ఆన్లైన్ గేమ్స్ వ్యవహారం తిరిగి ప్రారంభం కావడంతో యువత పక్కదారి పడుతున్నారని.. ఇలాంటి వాటిపై పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆన్లైన్ రమ్మీ, ఇతర గ్యాంబ్లింగ్ ఆటలోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్సైట్లు ఇంటర్నెట్లో భారీ ప్రకటనలిస్తుంటాయి. వీటికితోడు మా వెబ్సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్ ఆఫరిస్తామంటూ బుట్టలో పడేస్తున్నాయి. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నాయి. ఇది వ్యసనంగా మారడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటల నుంచి బయటకు రాని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. ఏ సభ్యుడు రోజు ఎంత సేపు ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తిస్తూ, ఆన్లైన్ సైట్ నిర్వాహకులు వారి దృష్టంతా ఆటపై ఉండేందుకు జిమ్మిక్కులు చేస్తుంటారు.
మొదట రమ్మీ, ఇతర బెట్టింగ్ ఆటలు ఆడినవారికి గెలిచేందుకు కొంత అవకాశమిస్తారు. ఆ తరువాత వారికి ఆటను అలవాటు చేసి ఇక ఆశలో వారిని ముంచేస్తుంటారు. పదిసార్లు పెట్టుబడి పెడితే అందులో 8 సార్లు నష్టపోవడం, రెండు సార్లు లాభం వచ్చినట్లు చూపించే లాజిక్స్ను బ్యాకెండ్ నుంచి గ్యాంబ్లింగ్ ఆట నిర్వాహకులు చేస్తుంటారు. ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆటపై గతంలో హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కలర్ ప్రిడిక్షన్ గేమ్ను గతంలో ఉక్కుపాదంతో అణిచివేశారు. ఈ గేమ్లో నష్టపోయిన వారు ఆత్మహత్మలు చేసుకుంటుండటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వేగంగా పోలీసులు స్పందించి మూలాల వరకు వెళ్లి ఆన్లైన్లో జరిగిన స్కామ్ను వెలుగులోకి తెచ్చి దేశవ్యాప్తంగా నిర్వాహకులను పట్టుకున్న విషయం తెలిసిందే.