రామగిరి/తొర్రూరు/అమీర్పేట్, మార్చి 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి పీఆర్టీయూ (టీఎస్) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న 34 మండల శాఖల అధ్యక్ష, కార్యదర్శులు మద్దతు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవిలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తొర్రూరు బ్రాహ్మణ సంఘం తెలిపింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘీభావ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సమక్షంలో ఈ మేరకు తీర్మానించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి ఎస్సార్నగర్, సనత్నగర్ వయోధిక సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. శనివారం వయోధికుల మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలి పూర్వ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారితో కలిసి అధ్యక్షుడు సహదేవ్గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.