తాండూర్, అక్టోబర్ 11 : తమ చెమట చుక్కలను ధారపోసి అందరికీ వెలుగులు పంచిన రిటైర్డ్ కార్మికులు, ప్రస్తుతం చాలీచాలని పెన్షన్తో బతుకులు వెల్లదీస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి భరోసానిచ్చే చర్యలు చేపట్టారు. ఈ మేరకు కనీస పెన్షన్ కల్పించాలని నిర్ణయించి, సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో నివేదికలు ఇవ్వాలని సూచించగా, రిటైర్డ్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలీచాలని పెన్షన్తో ఎలా బతకాలో తెలియని దుస్థితిలో సింగరేణి రిటైర్డ్ కార్మికులున్నారు. కష్టపడి పనిచేసి రిటైర్ట్ అయిన కార్మికుడు పిల్లల పెండ్లిండ్లు చేసి, ఓ ఇల్లు నిర్మించుకొనే సరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. వచ్చే పెన్షన్తోనైనా బతుకుదామంటే నెలకు వచ్చేది రూ.500 నుంచి రూ.1000లోపే, ఇక మరికొందరికైతే దారుణం. రూ.300, రూ.400 వస్తుందంటే వారి పరిస్థితి అర్థ్ధం చేసుకోవచ్చు. కొడుకులు ఆదరించని, పిల్లలు లేని వారి పరిస్థితి వర్ణనాతీతం. ఉద్యోగ విరమణ పొంది విశ్రాంతి తీసుకొనే సమయంలో కొందరు కూలీ పనికి వెళ్తున్నారు. పూట గడవని స్థితిలో అంతకుమించి ఏం చేస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో వారు ఏం పని చేస్తారని వారికి పని కూడా ఇవ్వడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బతుకులు వెళ్లదీస్తున్నారు.
వేల సంఖ్యలో బాధితులు..
రాష్ట్రప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ వస్తే, సింగరేణి కార్మికులకు కేవలం 25 శాతమే వస్తున్నది. 1998 నుంచి 2007 సంవత్సరం మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి రూ.500 నుంచి రూ.వెయ్యిలోపే వస్తున్నది. ఈ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ కార్మికులు65 వేల మంది వరకున్నారు. రూ.1000 నుంచి రూ.1600 వరకు పెన్షన్ పొందుతున్న వారు 67,958 మంది ఉన్నారు. అలాగే రూ.1500 నుంచి రూ.2200 పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య కూడా 48 వేల మంది వరకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ట్ ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ ఇవ్వడంతోపాటు ప్రతి సంవత్సరం కొంత పెరుగుదల ఉంటుంది. కానీ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు మాత్రం ఆ సౌకర్యం లేదు. కార్మికుడు పని చేసిన కాలంలో తీసుకున్న బేసిక్ జీతం, డీఏ కలిపి 40 శాతం పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి ఉంది. అయినా దీనిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై దృష్టి సారించారు.
సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆనందం..
ఇటీవల సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులు పడుతున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. రిటైర్డ్ కార్మికులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వారికి కనీస పెన్షన్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తనకు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే కచ్చితంగా చేస్తారని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య నియామకాలు మొదలుకొని లాభాల వాటా, వయోపరిమితి పెంపు ఇలా అన్ని రకాలుగా ఆయన తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తున్నారు. చాలీచాలని పెన్షన్తో బతుకులు ఈడుస్తున్న తమకు సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో సంతోషదాయకమని రిటైర్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులుచెబుతున్నారు.
కేసీఆర్ అంటే కచ్చితంగా చేస్తారు..
ఆంధ్రపాలనలో సింగరేణికి అన్యాయం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు సంస్థకు ఎంతో మేలు చేస్తున్నాయి. కార్మికులకు సైతం లబ్ధి చేకూరుస్తున్నాయి. నాకు పెన్షన్ రూ.1050 వస్తున్నది. నాయకులకు పెన్షన్ విషయంలో ఎన్నోమార్లు చెప్పినా కనీసం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి విరమణ కార్మికులకు కనీస పెన్షన్ ఉండాలని తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. ఆయన అనుకుంటే కచ్చితంగా చేస్తారు.