విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తాం
కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర
ఆసిఫాబాద్, జూన్ 11 : నకిలీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర అన్నారు. ఆసిఫాబాద్ పరిధిలో రూ.3 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. కాగా పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం డీఎస్పీ అచ్చేశ్వర్రావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలోని నంబాలలో బాబురావు వద్ద 100 కిలోలు, ఆసిఫాబాద్ బస్టాండ్లో రెబ్బెన మండలం ఇంద్రానగర్కు చెందిన వెంకటేశ్ వద్ద 50 కిలోల నకిలీ విత్తనాలను ఐడీపార్టీ పోలీసుల సమాచారం మేరకు ఆసిఫాబాద్ పోలీసులు పట్టుకున్నారని వెల్లడించారు.
జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మినా, ప్రోత్సహించినా వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు. రైతులు బిల్లులు లేని విత్తనాలను కొనుగోలు చేసి, నష్టపోవద్దని సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.83 లక్షల విలువ గల 45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని 21 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాటిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఐడీ పార్టీ సిబ్బంది రమేశ్, మహేశ్కు నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ సమావేశంలో సీఐ అశోక్, ఎస్ఐలు గంగన్న, వెంకటేశ్, రాజేశ్వర్, తేజస్విని, సిబ్బంది పాల్గొన్నారు.
రెబ్బెనలో 50 కిలోలు పట్టివేత..
రెబ్బెన, జూన్ 11 : రెబ్బెన మండలంలోని జక్కులపల్లికి చెందిన దోని రాజేశ్ వద్ద అక్రమంగా నిల్వ ఉన్న రూ.80 వేల విలువ గల 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు రెబ్బెన ఎస్ఐ భవానీసేన్ తెలిపారు. జక్కులపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయనే సమాచారం మేరకు తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో రాజేశ్ వద్ద నకిలీ విత్తనాలు లభ్యమైనట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీస్స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.