పల్లె, పట్టణాల్లో పతాకావిష్కరణ చేసిన ప్రజాప్రతినిధులు
మారుమోగిన జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలు
బైక్ ర్యాలీల జోరు.. డప్పు వాయిద్యాల మధ్య నృత్యాల హోరు..
పాల్గొన్న ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, టీఆర్ఎస్ శ్రేణులు
కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జెండా పండుగ గురువారం అట్టహాసంగా కొనసాగింది. పల్లెలు, పట్టణాల్లో టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. డప్పు వాయిద్యాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేశారు. జై తెలంగాణ.. జై జై కేసీఆర్ నినాదాలతో మారుమోగించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావు, కాగజ్నగర్లో కోనప్ప, ఆదిలాబాద్లో జోగు రామన్న, ఖానాపూర్లో రేఖానాయక్, ముథోల్లో విఠల్రెడ్డి గులాబీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి తెలంగాణ నినాదాలు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను ఊరూరా ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడా పార్టీ జెండా ఎగురవేశారు. ఆయా చోట్ల ర్యాలీలు తీశారు. నృత్యాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీసి, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రైతులు పొలాల్లో గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఇచ్చోడలోని కోకస్మన్నూర్లో డప్పువాయిద్యాలతో వేడుకలు నిర్వహించారు. ఆదిలాబాద్ మండలంలోని గ్రామాల్లో ఎంపీపీ సెవ్వలక్ష్మి, నాయకుడు జగదీశ్ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. ఇంద్రవెల్లిలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అంజద్, ఉట్నూర్లో ఎంపీపీ జైవంత్రావ్, తాంసిలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, బేలాలో సర్పంచ్ ఇంద్రశేఖర్, జైనథ్లో మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్ ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండలంలోని పీచరలో డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ రఘునందన్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. భైంసా మండలంలోని వాలెగాం లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి జెండా ఎగురవేశారు. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట్లో వార్డు కౌన్సిలర్ నేరేళ్ల వేణు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా.. మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో స్వీట్లను పంచిపెట్టారు. ప్రియదర్శినినగర్, ఆదర్శనగర్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ వేడుకలను నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు ధర్మాజి రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా..
మంచిర్యాలలోని ఆర్అండ్బీ కార్యాలయం ముందు, నస్పూర్ పార్టీ కార్యాలయం, హాజీపూర్ బస్టాండ్, లక్షెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా, దండేపల్లి మండల కేంద్రంలోని బస్టాండు వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు గులాబీ జెండాలను ఎగురవేశారు. జిల్లా కేంద్రంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. మందమర్రి మండలం బీ1 పార్టీ కార్యాలయం, టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్ నల్లాల ఓదెలు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై తెలంగాణ.. జైజై కేసీఆర్.. నినాదాలతో హోరెత్తించారు. వార్డు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీలను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. కాగా, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయగా, జిల్లా నుంచి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పండుగను ఊరూరా పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించాయి. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. కాగజ్నగర్ పట్టణంలో పలుచోట్ల సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ జెండాలను ఆవిష్కరించారు. ద్వారకానగర్ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు పాల్గొన్నారు. జైనూర్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, కౌటాలలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య, ఆయా మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు జెండాలను ఆవిష్కరించారు.