రైతులు నష్టపోకుండా చూడాలి
ఏది కొన్నా రసీదు తప్పనిసరి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, జూలై 2: జిల్లాలో నకిలీ విత్తనాలు, నిషేధిత ఎరువుల సరఫరా, వినియోగంపై జిల్లా వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో వరి, పత్తి ఎక్కువగా సాగవుతుందన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారని తెలిపారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ ఏవో పోస్టులు ఖాళీ లేకుండా చూడాలని, ప్రసూతి సెలవులపై వెళ్లిన వారి స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్న వారి వివరాలతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేయాలని తెలిపారు. రైతులు ఎరువులు, విత్తనాలు సాగుకు సంబంధించి కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గత సంవత్సరం పంట రుణాల లక్ష్యాన్ని పూర్తి చేసి, ఈ సంవత్సరం రుణాలపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జేసీబీలు రహదారి పై వెళ్లేటప్పుడు రోడ్లు చెడిపోకుండా సంబంధిత వాహన యజమానులు చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, జిల్లా వ్యవసాయ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.