మధిర నియోజకవర్గవ్యాప్తంగా 50వేల మంది బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యులు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి మధిరలో గులాబీ జెండా ఎగురవేద్దామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. బోనకల్లు మండలం జానకీపురంలోని తేజా కల్యాణ మండపంలో మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు అధ్యక్షతన 22 గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకోకుండా పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయకపోయినా, రాష్ర్టాన్ని బాగు చేస్తానని పర్యటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
బోనకల్లు, ఏప్రిల్ 18: వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి, విజయాన్ని సాధించుకుని మధిరలో గులాబీ జెండా ఎగురవేద్దానమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం జానకీపురంలోని తేజా కల్యాణ మండపంలో మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు అధ్యక్షతన 22 గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకోకుండా పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయకపోయినా, రాష్ర్టాన్ని బాగు చేస్తానని పర్యటించడం విడ్డూరమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు గుణపాఠం చెప్తారన్నారు. ఇప్పుడు దేశమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించగల నాయకుడు కేసీఆరేనని విశ్వసిస్తున్నారన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, స్థితిగతులు తెలిసింది ఒక్క కేసీఆర్కేనన్నారు. ప్రజలకు సేవ చేయడం లక్ష్యంతోనే కేసీఆర్ పాలన సాగిస్తున్నందున ఆయనకు ఆదరాభిమానాలు మరింత పెరగుతున్నాయన్నారు. కానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ‘నేనే నాయకుడిని.. నా మనుషులకే పదవులు రావాలి..’ అని కోరుకుంటున్నారన్నారు. పార్టీ లక్ష్యాలను పక్కన పెట్టి వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ కారణంతోనే పార్టీ అధిష్ఠానం ఆయన్ను పక్కన పెట్టిందని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. సమావేశంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జంగా రవి, మాజీ జడ్పీటీసీ బానోతు కొండా, రజకసంఘం జిల్లా అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, నాయకులు బంధం శ్రీనివాసరావు, కాకాని శ్రీనివాసరావు, ఏనుగు నాగేశ్వరరావు, తన్నీరు రవికుమార్, షేక్ ఇబ్రహీం, షేక్ రహీం, బంధం నాగేశ్వరరావు, మోదుగు నాగేశ్వరరావు, కరివేద సుధాకర్, పల్లబోతుల వెంకటేశ్వరరావు, చంద్రం, సూర్యదేవర సుధాకర్, ఇటికాల శ్రీనివాసరావు, ముడావత్ సైదా, రేగళ్ల వీరయ్య, సర్పంచ్లు చేబ్రోలు మల్లికార్జునరావు, తొండపు వేణు, కోటపర్తి హైమావతి, తేరబత్తిని శాంతయ్య, జెర్రిపోతుల రవీందర్, పారా ప్రసాద్ పాల్గొన్నారు.
‘వచ్చే మధిరలో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి. నియోజకవర్గవ్యాప్తంగా 50 వేల బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యుడూ ఇంటింటికీ సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలి. ఇటీవల అకాల వర్షంతో వాటిల్లిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు మండల పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దేవుడు అంటున్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు సమష్టిగా పనిచేద్దాం. రాష్ట్రవ్యాప్తంగా 13 పంచాయతీలు ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయంటే కేసీఆర్ పాలనకు నిదర్శనం. ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేరుస్తున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే.’