బోనకల్లు, డిసెంబర్ 4: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభు త్వం ప్రత్యేక కృషి చేస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో బాల్బ్యాడ్మింటన్ క్రీడకు చిరునామాగా బోనకల్లు వర్ధిల్లుతోందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బోనకల్లు క్రీడాకారులు ఉత్తమ అవార్డులు అందుకోవడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని వివరించారు.
క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు క్రీడాకారుల భవిష్యత్కు దోహదపడతాయని అన్నారు. ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందించారు. అనంతరం జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో బాలురు, బాలికలు, పురుషులు, మహిళల జిల్లా జట్లను ఎంపిక చేశారు. వైరా ఏసీపీ రెహమాన్, టీఆర్ఎస్ నాయకులు చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూరి ప్రసాద్, బంధం శ్రీనివాసరావు, బాణోతు కొండ, తిరుపతి కిశోర్, కోచ్ అమరేషు లింగయ్య పాల్గొన్నారు.