మధిర, సెప్టెంబర్ 21: బీఆర్ఎస్ సర్కార్లోనే విద్యారంగం బలోపేమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గురువారం ఆయన మండలంలోని ఖమ్మంపాడులో పర్యటించారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.97 లక్షల నిధులతో నిర్మించిన నూతన భవనం, తరగతి గదులు, కిచెన్ షెడ్డు, మరుగుదొడ్లను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జడ్పీ చైర్మన్ ముచ్చటించారు. మంచిగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక రైతువేదికలో ఏర్పాటు చేసిన సభలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను ‘మన బడి’ కార్యక్రమం ద్వారా తీర్చిదిద్ది సకల సదుపాయాలూ కల్పిస్తున్నారని వివరించారు. దీంతో పరీక్షల్లోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్య బలోపేతానికి ఎంతగానో కృషిచేస్తున్నారని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ‘మన బడి’ పనులు ఖమ్మంపాడు గ్రామంలోనే పూర్తిస్థాయిలో జరిగినట్లు చెప్పారు.
గ్రామంలో దాతలు ముందుకొచ్చి పాఠశాల భవనానికి స్థలాన్ని దానం చేయడం వల్లే ఈ పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తయిందన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు. అదేవిధంగా గ్రామంలో రూ.1.75 కోట్లతో చేపట్టే క్రీడా ప్రాంగణం, రైతువేదిక ప్రహరీగోడ వంటి అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, మెండెం లలిత, సోమశేఖరశర్మ, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సిలార్సాహెబ్, దొండపాటి వెంకటేశ్వరరావు, దొండపాటి మాణిక్యమ్మ, వై.ప్రభాకర్, రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా వేణు తదితరులు పాల్గొన్నారు.