మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కొనలేమని చేతులెత్తేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం భారం అయినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులు సస్యశ్యామలంగా ఉండటంతో రైతులందరూ వరి పంటను ఎంచుకోవడం వల్ల ధాన్యం కొనుగోలు కొంత ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రభుత్వ సూచన మేరకు యాసంగిలో వరికి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మాటూరు గ్రామంలో సిమెంట్రోడ్డుకు జడ్పీచైర్మన్ శంకుస్థాపన చేశారు.
అనంతరం చిలుకూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, సర్పంచ్లు కనకపుడి పెద్దబుచ్చయ్య, మేడిశెట్టి లీలావతి, చిలుకూరు నిడమనూరి సంధ్యారాణి, ఎంపీపీ మెండెం లలిత, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ చావా వేణు, టీఆర్ఎస్ నాయకులు కోన నరేందర్రెడ్డి, ఏవో డీ.ఎన్.కే.శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.