సద్దుల బతుకమ్మ సంబురానికి మహిళాలోకం సిద్ధమైంది. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలు నేటితో ముగియనున్నాయి. తొమ్మిదిరోజులపాటు తీరొక్కపూలతో బతుకమ్మలను చేసి ఆటలు ఆడి పాటలు పాడారు. రోజుకో ప్రసాదంతో నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించిన భక్తులు చల్లంగా చూడమ్మ బతుకమ్మ తల్లీ అంటూ గౌరమ్మను వేడుకున్నారు. చివరిరోజు ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా సంబురాలు నిర్వహించేందుకు ఆయా ఘాట్ల వద్ద అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరిరోజు సద్దుల బతుకమ్మలకు వీడ్కోలు పలికేందుకు సమాయత్తమయ్యారు. మహిళలంతా ఒకేచోటకు చేరుకొని పెద్దపెద్ద బతుకమ్మలను కూడలి వద్ద ఉంచి ఆటలు ఆడి అనంతరం ఘాట్ల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొత్తగూడెం టౌన్, అక్టోబర్ 21 : తొమ్మిదిరోజులు తీరొక్కపూలతో సంబురంగా జరుపుకున్న బతుకమ్మ పండుగకు సద్దుల బతుకమ్మతో వీడ్కోలు పలికేందుకు మహిళలు సిద్ధమయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మలను చేసి మహిళలు పెద్దఎత్తున ఆటలు ఆడి పాటలు పాడి చల్లంగా చూడమ్మ బతుకమ్మ తల్లి అంటూ గౌరమ్మను కొలిచారు. రోజుకో ప్రసాదంతో బతుకమ్మకు నైవేద్యం సమర్పించి గల్లీ నుంచి పట్నం వరకు వార్డుల్లో బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో రోజుకొక కార్యాలయం వద్ద బతుకమ్మ ఆటలు ఆడి సంబురంగా వేడుకలు నిర్వహించుకున్నారు. తొమ్మిదిరోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలు చివరిరోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా సంబురాలు నిర్వహించుకునేందుకు ఆయా ఘాట్ల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బతుకమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటేలా ఉండనున్నాయి.
జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మొర్రేడువాగు, రామవరం గోధుమవాగు, రుద్రంపూర్లోని ధన్బాద్ చెరువు, పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచలో ఉన్న రాతిచెరువు కట్ట, వికలాంగుల కాలనీలోని చింతలచెరువు, సుజాతనగర్, చుంచుపల్లి, పాల్వంచ మండల పరిధిలోని ఉత్సవ కమిటీల నిర్వాహణలో బతుకమ్మ సంబురాల్లో భాగంగా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాకేంద్రంతోపాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలు సిద్ధమవుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సీఐలు తమ సిబ్బందితో కలిసి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచనలు చేశారు. పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు.